Hyderabad: హైదరాబాద్ ఉగ్రదాడి కుట్ర కేసులో మరో వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నగరంలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు అబ్దుల్ జాహెద్ కు రూ.40 లక్షలు సమకూర్చాడనే ఆరోపణలపై అబ్దుల్ కరీం (39)ను అరెస్టు చేశారు.
Hyderabad terror attack conspiracy case: హైదరాబాద్ ఉగ్రవాద కుట్ర కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీ యూనిట్ నగరంలో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణల క్రమంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ జాహెద్ కు రూ .40 లక్షలు సమకూర్చాడనే ఆరోపణలపై అబ్దుల్ కరీం (39) ను అరెస్టు చేసింది. ఈ కేసును తొలుత హైదరాబాద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నమోదు చేయగా, ఉగ్రదాడికి కుట్ర.. దీనికి వెనుక దేశ భద్రతకు మప్పును కలుగజేసే నెట్ వర్క్ వుందనే అంచనాల మధ్య ఇటీవల ఎన్ఐఏకు బదిలీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద 2022 అక్టోబర్ లో హైదరాబాద్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నారనే అభియోగాలపై దర్యాప్తు సంస్థ అనుమానితులను తిరిగి అరెస్టు చేసింది.
హైదరాబాద్ లో ఉగ్రవాదానికి సంబంధించిన ఇతర కేసుల్లో జాహెద్ ప్రమేయం ఉందని ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధం కలిగిన పాకిస్థాన్ కు చెందిన హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్ తదితరులను ఉగ్రకుట్ర కోసం రిక్రూట్ చేసుకున్నాడు. హైదరాబాద్ లో పెద్దఎత్తున విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేసుకుంటున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే ఏన్ఐఏ మరింత దూకుడుగా ఈ కేసును విచారణ జరుపుతోంది. కాగా, 2005లో ఆత్మాహుతి దాడి కేసులో అరెస్టయిన జాహెద్ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2017లో విడుదలయ్యాడు.
పాకిస్థాన్ కు చెందిన తన హ్యాండ్లర్ల సూచనల మేరకు హైదరాబాద్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు జాహెద్ తన ముఠా సభ్యులతో కలిసి కుట్ర పన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రదాడుల కోసం ఉగ్రసంస్థల నుంచి పొరుగు దేశాల మీదుగా ఈ కుట్రలో భాగంగా ఉన్న వారి సాయంతో జాహెద్ హ్యాండ్ గ్రెనేడ్లను అందుకున్నాడని, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించడానికి నగరంలో బహిరంగ సభలు, ఊరేగింపులపై వాటిని విసిరేయాలని యోచిస్తున్నట్లు తదుపరి దర్యాప్తులో తేలిందని సమాచారం. నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఎన్ఐఏను ఆదేశించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ లో పేలుళ్లు, ఇతర దాడులతో సహా ఉగ్రవాద కార్యకలాపాలకు పొరుగు దేశానికి చెందిన ఉగ్రవాద హ్యాండ్లర్ల సూచనల మేరకు జాహెద్ తన ముఠా సభ్యులతో కలిసి కుట్ర పన్నినట్లు కేంద్రానికి సమాచారం అందిందని తెలిపింది.
