హైదరాబాద్‌లో ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌ను చితకబాదారు.

హైదరాబాద్‌లో ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌ను చితకబాదారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సూరారంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మల్లారెడ్డి టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత రాత్రి ఆయన విధుల్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు.. బస్సును ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి, అది కుదరకపోవడంతో, వాహనాన్ని అడ్డగించారు. వెంటనే బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌‌పై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పైకి దూసుకెళ్లినట్లు గుర్తించారు. నిందితుల దాడిలో డ్రైవర్‌ ముఖం, ముక్కుపై గాయాలు అయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Scroll to load tweet…

ఇక, ఈ ఘటనకు సంబంధించి సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తులు గంజాయి మత్తులో ఉన్నట్టుగా ఘటనస్థలంలోని వ్యక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.