షర్మిల సభకు పోలీసుల అనుమతి: ఒక్క రోజే దీక్షకు పర్మిషన్
వైఎస్ షర్మిల సభకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యలపై మూడు రోజుల దీక్షకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరారు
హైదరాబాద్: వైఎస్ షర్మిల సభకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యలపై మూడు రోజుల దీక్షకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరారు. అయితే షర్మిల సభకు ఒక్క రోజే అనుమతి ఇచ్చారు పోలీసులు.ఈ నెల 9వ తేదీన ఖమ్మం లో నిర్వహించిన సభలో షర్మిల మూడు రోజుల పాటు హైద్రాబాద్ లో దీక్ష చేస్తానని ప్రకటించారు. అంతేకాదు ఈ మేరకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు.
also read:వైఎస్ షర్మిల మూడు రోజుల నిరాహారదీక్ష: పోలీసులకు దరఖాస్తు
షర్మిల లేఖకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే మూడు రోజులకు బదులుగా ఒక్క రోజు మాత్రమే అనుమతిని ఇచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు షర్మిల ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్ తో షర్మిల ఈ దీక్షకు చేయనున్నారు. ఈ దీక్షకు మద్దతివ్వాలని గద్దర్, కోదండరామ్, ఆర్. కృష్ణయ్య వంటి నేతలకు కూడ ఆమె లేఖలు రాశారు.
తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఖమ్మం సభలో షర్మిల ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో పలు సమస్యలను తీసుకొని ఆందోళనలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నిరుద్యోగుల సమస్యపై ఆమె దీక్షకు దిగనున్నారు.