వైఎస్ షర్మిల మూడు రోజుల నిరాహారదీక్ష: పోలీసులకు దరఖాస్తు
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు.
హైదరాబాద్: మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పోలీసుల అనుమతి కోరారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీకి ఆమె దరఖాస్తు పెట్టుకున్నారు.
ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరాహార దీక్ష చేపట్టనున్నారు తన నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరుతూ షర్మిల ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు లేఖలు రాశారు. గద్దర్, కోదండరామ్, ఆర్. కృష్ణయ్య వంటి నేతలకు ఆమె లేఖలు రాశారు. ప్రతిపక్షాల నేతలకు కూడా షర్మిల లేఖలు రాశారు.
తాను నిరాహారదీక్ష చేస్తానని ఇటీవల ఖమ్మం సంకల్ప యాత్ర సభలో ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మం సభలో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీ విష,యంపై ఆమె కేసీఆర్ ప్రభుత్వం మీద విరుచుకుప్డడారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. పార్టీ పేరును ప్రకటించడానికి ముందు నుంచే ఆమె రాజకీయాలపై కసరత్తు చేస్తున్నారు. వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఆమె నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.