వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్  షర్మిలపై  మూడు  సెక్షన్ల  కింద  పోలీసులు  కేసు నమోదు చేశారు.  పంజాగుట్ట పోలీసులు  షర్మిలపై  కేసులు పెట్టారు.  

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై షర్మిల హంగామా చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 353, 333, 337 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారని మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. 

నిన్న నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరిలో వైఎస్ షర్మిలకు చెందిన బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు షర్మిల పార్టీకి చెందిన వాహనాలపై దాడి చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. ఈ దాడిలో నాలుగు వాహానలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి.ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. నిన్న రాత్రి షర్మిలను లోటస్ పాండ్ లో వదిలి నర్సంపేట పోలీసులు వెళ్లిపోయారు.

నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది. పోలీసుల కళ్లుగప్పి షర్మిల లోటస్ పాండ్ నుండి బయటకు వెళ్లింది. సోమాజీగూడ నుండి ధ్వంసమైన కారుతో ప్రగతి భవన్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు పంజాగుట్టలో షర్మిలను అడ్డుకున్నారు. కారులోనుండి దిగకుండా ఆమె నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడ దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

also read:కారు డోర్లు ఓపెన్: ఎస్ఆర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లోకి షర్మిల తరలింపు

 ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత కూడా ఆమె కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్ చేసి షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు.షర్మిలకు మద్దతుగా వచ్చిన వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.షర్మిలను విడుదల చేయాలని కోరుతూ భవనం ఎక్కి నిరసనకు దిగిన పలువురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.