హైద్రాబాద్‌లో  ఎఎస్‌రావు నగర్  లో  దీపం వత్తులు, బొట్టు బిళ్లల మెషీన్ల పేరుతో  ప్రజలను మోసం  చేసిన  ఆర్ఆర్ ఎంటర్ ప్రైజెస్  కు చెందిన రమేష్ రావును పోలీసులు అరెస్ట్  చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో  ఉన్న రమేష్ రావును పోలీసులు అరెస్ట్  చేశారు.

హైదరాబాద్: నగరంలోని ఎఎస్‌రావు నగర్ లో దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో మోసం చేసిన ఆర్ఆర్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రమేష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధి లభిస్తుందని దీపం ఒత్తులు, బొట్టు బిళ్లల మెషీన్లను విక్రయించాడు రమేష్ రావు. తయారు చేసిన బొట్టు బిళ్లలు, దీపం వత్తులను తానే కొనుగోలు చేస్తానని కూడా అతను ఒప్పందం చేసుకున్నాడు. మెషీన్లు కొంతకాలం తర్వాత పనిచేయక మొరాయిస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మెషీన్లను రిపేర్ చేసి తిరిగి ఇస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో బాధితుల ఫోన్లను రమేష్ రావు సహా ఆఫీసులో పనిచేసే సిబ్బంది లిఫ్ట్ చేయడం లేదు. ఈ నెల 28న పలువురు బాధితులు ఆర్ఆర్ ఎంటర్ ప్రైజెస్ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే కార్యాలయం మూసి వేసి ఉంది. రమేష్ రావు సహా ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా పనిచేయడం లేదు. దీంతో కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తాము మోసపోయినట్టుగా గుర్తించిన బాధితుులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఓటీ పోలీసులు రమేష్ రావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

also read:వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ.200కోట్ల భారీ స్కాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న విషయాన్ని గుర్తించారు. రవేష్ రావును ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరిపేట నుండి రమేష్ రావును హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీకి చెందిన మెషీన్లు, ముడి సరుకు విషయమై రమేష్ రావు సుమారు రూ. 250 కోట్లు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రమేష్ రావును పోలీసులు విచారించనున్నారు. బాధితులు తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.