హైదరాబాద్లో ప్లాట్ సొంతం చేసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. రాజీవ్ స్వగృహ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ ప్లాట్ల పబ్లిక్ వేలం జరగనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తొర్రూర్లో ప్రభుత్వ ఓపెన్ ప్లాట్ల వేలం
రంగారెడ్డి జిల్లా తొర్రూర్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ ప్లాట్ల పబ్లిక్ వేలం జరగనుంది. ఈ వేలం ఆగస్టు 10, ఆదివారం, పెద్ద అంబర్పేట్లోని అవికా గ్రాండ్లో నిర్వహించనున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ ఈ వివరాలను వెల్లడించారు. నిజానికి ఈ వేలం ఆగస్టు 6న జరగాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
100 ప్లాట్ల విక్రయానికి ప్రభుత్వ ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వం గత నెలలో 100 ప్లాట్లను పబ్లిక్ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సుమారు 240 మంది కొనుగోలుదారులు ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు. తొర్రూర్ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో ఉండడం, హైదరాబాద్కు మంచి కనెక్టివిటీ ఉండటం వల్ల ఇది రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ప్రాధాన్యత పొందుతోంది.
ప్రాజెక్ట్ వివరాలు, మౌలిక సదుపాయాలు
రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్లు, సక్రమంగా డిజైన్ చేసిన హౌసింగ్ లేఅవుట్ ప్రాథమిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు పథకాల కింద అమ్మకానికి మిగిలిన ఆస్తులను విక్రయించి, ప్రస్తుత, భవిష్యత్ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. అధికారుల ప్రకారం, ఈ ప్లాట్లు చట్టపరంగా ఎలాంటి వివాదాలు లేవు.
వేలం విధానం, నియమాలు
వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా నమోదు చేసుకోవాలి. Earnest Money Deposit (EMD) చెల్లించాలి. అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిడ్డింగ్లో పాల్గొనాలి. ఈ వేలం పారదర్శకంగా జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా ORR వద్ద గృహ స్థలాలపై డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తూరూర్ ప్లాట్లపై గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
రూ. 100 కోట్లకు పైగా ఆదాయం
ఇటీవల 50 రాజీవ్ స్వగ్రుహ ఆస్తుల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఆగస్టు 5న జరిగిన వేలంలో బహదూర్పల్లి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 68 ప్లాట్లను విక్రయించారు. ఒక్కో స్క్వేర్ యార్డుకు రూ.46,600 వరకు ధర పలికింది. కార్నర్ ప్లాట్లకు రూ.30,000, మిగిలిన ప్లాట్లకు రూ.27,000 రేటును అధికారులు నిర్ణయించారు. మొత్తం 119 మంది బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొన్నారు.
