అదృశ్యమైన టెక్కీ... నదిలో శవంగా తేలాడు
అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హిమాయత్ సాగర్ నీటిలో శవమై తేలాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హిమాయత్ సాగర్ నీటిలో శవమై తేలాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... రాజేంద్రనగర్ కి చెందిన వెంకటేశ్వర్లు(40)... నగరంలోని ఓ ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అతనికి భార్య శైలజ, పదేళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం అతను వాకింగ్ కి వెళ్తున్నట్లు ఇంట్లో భార్యకి చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి ఎంత సమయం గడిచినా ఇంటికి రాలేదు. దీంతో... ఆమె చుట్టుపక్కల గాలించింది. అయినా ఫలితం దక్కలేదు. దీంతో... ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ఓ వ్యక్తి హిమాయత్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం లభించింది. అతని శవం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నానికి అతని శవం బయటపడింది. అప్పటికే అతని శరీరాన్ని చేపలు కొరికనట్లు కనపడుతోంది.
వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని... ఆ కారణంతోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.