ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త... పండగల సీజన్లో బంపర్ ఆఫర్లు
దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సందర్భంగా మెట్రో రైలులో ప్రయాణించేవారి కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ సరికొత్త ఆఫర్లు ప్రకటించింది.
హైదరాబాద్: ప్రస్తుతం భారీ నష్టాలను చవిచూస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రయాణికులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందకు వ్యాపారసంస్థలు, ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అనుసరించే వ్యూహాన్నే hyderabad metro సంస్థ కూడా ఎంచుకుంది. ప్రస్తుతం పండగల సీజన్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. ఇలా సొంతూళ్లకు వెళ్లేవారు, హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులు మెట్రోలో మరింత చౌకగా ప్రయాణం చేసేలా ఆ ఆఫర్లున్నాయి.
దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండగలు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇలా ప్రయాణించే వారికోసం హైదరాబాద్ మెట్రో ఆఫర్లను ప్రకటించింది. అతి తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరం మెట్రోలో ప్రయాణించే అవకాశాన్ని ప్రయాణికులు ఈ ఆఫర్ల ద్వారా పొందవచ్చు. అలాగే నెల నెలా ప్రత్యేక బహుమతులను కూడా అందించనున్నట్లు మెట్రో సంస్థ ప్రకటించింది.
మెట్రో సంస్థ ప్రకటించిన మూడు ఆఫర్లివే:
గ్రీన్ లైన్ ఆఫర్: పండగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లివచ్చే వారికోసం ప్రత్యేకంగా మెట్రో ఈ green line ఆఫర్ ప్రకటించింది. ఎంజీబీఎస్, జేబీఎస్, మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించేవారు కేవలం రూ.15 చెల్లించి ఎక్కడినుండి ఎక్కడికయనా ప్రయాణించవచ్చు. అంటే తమ ఇంటికి దగ్గర్లోని మెట్రో స్టేషన్ నుండి MGBS, JBS కు(దూరంతో సంబంధం లేకుండా) కేవలం రూ.15 చెల్లించి చేరుకోవచ్చు. అలాగే ఈ బస్టాండ్ల నుండి ఇంటి దగ్గర్లోని మెట్రో స్టేషన్ కు కూడా ఇలాగే రూ.15 చెల్లించి చేరుకోవచ్చు.
ఈ ఆఫర్ వచ్చేఏడాది సంకాంత్రి (జనవరి 15, 2022) అమల్లో ఉంటుందని మెట్రో ప్రకటించింది. స్మార్ట్కార్డు కలిగిన వారు మాత్రమే కాదు టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే వారికి సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.
read more తీవ్ర నష్టాల్లో మెట్రో.. ఆదుకోకపోతే మునిగిపోవడం ఖాయం.. ప్రభుత్వానికి ఎల్ అండ్ టి మొర...
ట్రిప్ పాస్ ఆఫర్: హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణించేవారికి ఆ ఆఫర్ ఉపయయోగపడుతుంది. కేవలం 20ట్రిప్పుల ఛార్జీలతో 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని ఆ ఆఫర్ అందిస్తుంది. 45 రోజుల పాటు ఆ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇది కేవలం మెట్రో స్మార్ట్ కార్డు కలిగినవారికి మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబరు 18 నుంచి వచ్చేఏడాది జనవరి 15 వరకు అమల్లో ఉంటుంది.
లక్కీ డ్రా: ఇకపై మెట్రోలో ప్రయాణించే వారిలోని కొందరు అదృష్టవంతులు బహుమతులు పొందనున్నారు. ప్రతినెలా మెట్రోలో ప్రయాణించినవారిలో కొందరిని లక్కీ డ్రా ద్వారా ఎంపికచేసి వారికి బహుమతులు అందించనున్నారు. ఇలా నెలకు ఐదుగురు లక్రీ ప్రయాణికులకు బహుమతులు అందనున్నాయి. అక్టోబరు 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ప్రతి నెలా డ్రా తీసి విజేతలను ఎంపిక చేయనున్నారు.
అయితే మెట్రో స్మార్ కార్డు ద్వారా ప్రయాణించే వారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. అదికూడా నెలకు కనీసం 20 ట్రిప్పులు ప్రయాణించి వుండాలి. ఇలా ప్రయాణించిన వారి metro smart card నంబర్ ఆధారంగా డ్రా తీసి వారికి బహుమతులు అందించనున్నారు.