తెలంగాణలో మంకీపాక్స్ అనుమానిత కేసు కలకలం రేపుతోంది. కువైట్ నుంచి కామారెడ్డికి తిరిగి వచ్చిన వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టుగా స్థానిక వైద్యులు గుర్తించారు. అనంతరం అతడిని హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్లో ఉంచారు.
తెలంగాణలో మంకీపాక్స్ అనుమానిత కేసు కలకలం రేపుతోంది. కువైట్ నుంచి కామారెడ్డికి తిరిగి వచ్చిన వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టుగా స్థానిక వైద్యులు గుర్తించారు. అనంతరం అతడిని హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్లో ఉంచారు. ఈ క్రమంలోనే ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ఆ వ్యక్తి కొంత నీరసంగా ఉన్నట్టుగా చెప్పారు. చేతులు, కాళ్లు, ఛాతీపై దద్దుర్లు ఉన్నాయని తెలిపారు. అయితే యంగ్ వ్యక్తి కావడంతో పరిస్థితి స్టేబుల్గా ఉందన్నారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేయడం జరిగిందన్నారు.
షార్ట్ టైమ్ కాంటాక్ట్ వల్ల మంకీ పాక్స్ సంక్రమించదని డాక్టర్ శంకర్ చెప్పారు. బాధితుడికి అతి దగ్గరగా ఉన్నవారికే మంకీపాక్స్ సోకే అవకాశం ఉందన్నారు. అతడి కాంటాక్ట్ అయిన వ్యక్తులను ట్రేస్ చేస్తున్నారని తెలిపారు. మంకీపాక్స్ గాలి ద్వారా సోకదని.. ప్రజలు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. వైరస్ నిర్ధారణ కోసం రోగి నుంచి 5 రకాల శాంపిల్స్ సేకరించినట్లుగా డాక్టర్ శంకర్ చెప్పారు. రేపు సాయంత్రానికి బాధితుడి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇక, మంకీ పాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి.. జూలై 6న కువైట్ నుంచి వచ్చాడు. అతడికి జూలై 20న జ్వరం వచ్చింది. జులై 23న ఆ వ్యక్తికి దద్దుర్లు రావడంతో కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అతడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టుగా గమనించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు.. అతడిని కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. అతడి నుంచి నమునాలు సేకరించి పూణెలోని ఎన్ఐవీకి పంపారు. ఇందుకు సంబంధించి రిజల్ట్స్ రావాల్సి ఉంది. అప్పటివరకు అతడిని ఫీవర్ ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచనున్నారు.
‘‘ఆ వ్యక్తితో పరిచయం ఉన్న ఆరుగురిని మేము గుర్తించాము. వారికి ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ.. వారిని కూడా ఐసోలేషన్లో ఉంచాం’’ సీనియర్ వైద్యాధికారులు చెప్పారు. మరోవైపు మంకీపాల్స్ అనుమానిత కేసు నేపథ్యంలో.. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు పరిస్థితిని సమీక్షించారు. ఆరోగ్య శాఖ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు.
