టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి: బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు
Hyderabad: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు జీ.కిషన్రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు.
Union Minister G. Kishan Reddy: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలను, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం షామీర్ పేటలో ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. అలాగే, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు జీ. కిషన్రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రజలకు చెప్పడానికి టిఆర్ఎస్ వద్ద ఏమీ లేనందున, బీజేపీపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ నాయకులు పార్టీ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనీ, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని విమర్శించడం వింతగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే సంక్షేమ పథకాల అమలును నిలిపివేస్తామని ప్రజలను బెదిరిస్తూ విజయం సాధించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాగా, బీజేపీ శిక్షణా శిబిరం మూడవ రోడు (చివరి రోజున) కాషాయ పార్టీ తన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తుంది. మునుగోడులో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించి టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, 2023 ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.
అంతకుముందు రోజు కూడా కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల దాడిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వ్యక్తులు దాడి చేశారని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం అరవింద్ ఇంటికి వెళ్లిన కిషన్రెడ్డి.. టీఆర్ఎస్ వర్గీయుల దాడిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిరాశ, అభద్రతా భావంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందన్నారు. టీఆర్ఎస్కు సర్వేలు చేయించి అధికారం పోతుందని గ్రహించిన తర్వాత బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సర్వేల ఫలితాలు చూసి ముఖ్యమంత్రికి, తన పార్టీకి అభద్రతా భావం పట్టుకుంది కాబట్టి వచ్చే ఏడాది అక్టోబరు వరకు సర్వేలు ఆపాలని సీఎం పేర్కొన్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ గూండాయిజానికి, రౌడీయిజానికి, అధికార దురహంకారానికి ఈ దాడి నిదర్శనమని కిషన్రెడ్డి అన్నారు.
దాడి దారుణం, శోచనీయమని పేర్కొన్న కేంద్రమంత్రి.. నగరం నడిబొడ్డున, ఎమ్మెల్యే కాలనీలో జరిగిన దాడి తెలంగాణ ఎటువైపు పయనిస్తోందో తెలియజేస్తోందని అన్నారు. ఇతర పార్టీల నేతలను బీజేపీ లాక్కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్ ఎంపీ ఇంటిపై చేసిన దాడిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తీవ్రంగా ఖండించారు. అరవింద్తో ఫోన్లో మాట్లాడినట్లు సంజయ్ తెలిపారు. "ప్రజాస్వామ్యంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్కు లేదు, భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడుతోంది. బీజేపీ సహనాన్ని మా అసమర్థతగా భావించవద్దు" అని ఆయన ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ రౌడీల దాడులకు బీజేపీ భయపడేది లేదనీ, టీఆర్ఎస్ పాలనా దౌర్జన్యాలపై ప్రతి కార్యకర్త ఉద్యమిస్తారని, టీఆర్ఎస్ గూండాలు హద్దులు దాటితే సహించేది లేదని, ప్రజలు టీఆర్ఎస్పై కర్రలు, రాళ్లు రువ్వే రోజు ఎంతో దూరంలో లేదు అని పేర్కొన్నారు.