Hyderabad: ములాకత్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గ ఓటర్లను కలిసేందుకు జైలు అధికారులు అనుమతించడం లేదనీ, అలాంటి తిరస్కరణ దేశ పౌరుల హక్కులను హరించడమేనని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు.
BJP leader Vijayashanthi: తమ పార్టీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ పట్ల సీఎం కేసీఆర్ కనికరం చూపడం లేదనీ, రాజాసింగ్ అరెస్టు తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల సీఎం కేసీఆర్ ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారో, వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో చెప్పడానికి ఈ అరెస్టు ఒక క్లాసిక్ ఉదాహరణ అని బీజేపీ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు విజయశాంతి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంచారని పేర్కొన్న విజయశాంతి.. చర్లపల్లి కేంద్ర కారాగారంలో తన భర్తకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజాసింగ్ భార్య హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆమె కోర్టును కోరారు. రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారనే విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోవడం దురదృష్టకరమని విజయశాంతి అన్నారు.
ములాకత్ సందర్భంగా రాజాసింగ్ నియోజకవర్గ ఓటర్లను కలిసేందుకు జైలు అధికారులు అనుమతించడం లేదని, అలాంటి తిరస్కరణ దేశ పౌరుల హక్కులను హరించడమేనని విజయశాంతి ఆరోపించారు. రాజాసింగ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి అనేక మంది మద్దతుదారులు ర్యాలీలు నిర్వహించారని ఆమె చెప్పారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం సహా పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజసింగ్ పై పీడీయాక్ట్ ప్రయోగించారు.
కాగా, అంతకుముందు కూడా ఆమె ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. సాగు నీటి ఇబ్బందులు, భూ కబ్జాలను ప్రస్తావిస్తూ.. ఇదే బంగారు తెలంగాణ? చెప్పండి కేసీఆర్? అంటూ ప్రశ్నించారు. "అరాచకాలకు అడ్రస్గా మారిన కేసీఆర్ సర్కార్కు తెలంగాణ ప్రజానీకం త్వరలోనే గట్టి గుణపాఠం చెప్పడం ఖాయం"మన్నారు.
ఏం కేసీఆర్? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? కేసీఆర్ సర్కార్ తీరు వల్ల ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా వాసులు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నం: విజయశాంతి
"కబ్జాకు గురికావడం, మట్టితో పూడుకుపోవడంతో ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా పోయాయి. దీంతో నీరు విడుదలైన సమయంలో ఆ నీళ్లన్నీ వృథాగా పోతున్నయి. ఆఫీసర్లకు ఈ విషయం తెలిసినా అసలు పట్టించుకోవడం లేదు" అని మండిపడ్డారు. అలాగే, "ఓ వైపు భూముల రేట్లు పెరిగిపోవడంతో రియల్టర్లు కాలువలను ఆక్రమించేస్తున్నరు. జిల్లాకు సాగు నీరు అందించాలని అప్పట్లో ఎస్సారెస్పీ పిల్ల కాలువలు నిర్మించారు. జిల్లాలో మొత్తం 15 మండలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలువలు కబ్జాకు గురికావడం, మట్టితో పూడుకుపోవడంతో ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా పోయాయి. దీంతో నీరు విడుదలైన సమయంలో ఆ నీళ్లన్నీ వృథాగా పోతున్నయి. ఆఫీసర్లకు ఈ విషయం తెలిసినా అసలు పట్టించుకోవడం లేదు" అని అన్నారు.
