హైదరాబాద్ మెట్రో పరుగులు తీయడానికి రెడీగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎన్నికల వరకు ఎందుకు ఆపుతోంది...? 

ఇంకా పట్టాలెక్కని హైదరాబాద్ మెట్రో కథ డైలీ సిరియల్ కంటే చాలా పెద్దదనే చెప్పొచ్చు..

ట్రయిల్ రన్ లు పూర్తైనా ఆరంభానికి మాత్రం ఇంకా నోచుకోవడమే లేదు. ఏడాది దాటినా పరుగు మాత్రం వాయిదా పడుతూనే ఉంది.

మెట్రో పునాది నుంచే పుట్టెడు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. అసలు ఈ ప్రాజెక్టే వేస్టు అని మెట్రో శ్రీధరన్ తేల్చిపారేసినా ఉమ్మడి ఏపీ సర్కారు మాత్రం ససెమిరా అంది.

మొదట ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకున్న మైటాస్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది.ఎల్ అండ్ టీ చేతికి ప్రాజెక్టు వచ్చినా అడుగడుగునా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి.

వాటన్నింటిని దాటుకుంటూ వచ్చిన తర్వాత మెట్టుగూడ రూట్ లో ట్రయిల్ రన్ కూడా పూర్తి చేసుకుంది.

ఏడాది దాటినా రియల్ రన్ మాత్రం జరగడం లేదు. అంటే ఇంకా ప్రారంభం మాత్రం కావడం లేదు. నగరజీవి కల ఇంకా నెరవేరడం లేదు.

వచ్చే జూన్ 2 న మెట్రో ను ప్రారంభిస్తారని ఆ మధ్య వార్తలొచ్చినా అవన్నీ పుకార్లనే తేలింది.

ఇప్పుడు తాజాగా గడువు 2019 వరకు పెరిగింది. ఈ వాయిదాకు కారణం ఎల్ అండ్ యాజమాన్యమే అయినా వారిపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడం లేదు.

ఇరువురి మధ్య ముందస్తు ఒప్పందంలో భాగంగానే ఇలా వాయిదాల పర్వం కొనసాగుతోందని సమాచారం

అసలు మెట్రో ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో అంటే జూలై 2017 నాటికి పనులు పూర్తి కావాలి. అలా పూర్తి కాకపోతే దానికి కారణం ఎవరో వారు పెనాల్టీ చెల్లించాలి.

ప్రభుత్వం వల్ల ఆలస్యం అయితే ప్రభుత్వం, ఎల్ అండ్ వల్ల ఆలస్యం అయితే వారు జరిమానా కట్టాలన్నమాట. కానీ, ఈ సారి వాయిదా ఇరు పక్షాల అంగీకారంతో జరగడంతో పెనాల్టీ ఊసే లేకుండా పోయింది.

కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన మెట్రో క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకే అధికార పార్టీ నే ఈ కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. అందుకే ఎన్నికలు వచ్చే 2019 వరకు మెట్రోను వారితోనే వాయిదా వేయించేలా పావులుకదిపినట్లు తెలిస్తోంది.

మెట్రో పరుగుతో వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లో బలం పుంజుకోవాలన్న టీఆర్ఎస్ కల నెరవేరుతుందో లేదో చూడాలి.