హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకలో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ముఖ్య అతిధిగా హాజరయి ఆ కులస్తులపై వరాలు కురిపించారు.

కరీంనగర్: సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ముదిరాజుల సమస్యలు పరిష్కరిస్తానని ఆర్థిక మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చాయా? అని అడిగారు. మత్స్యకారుల కోసం వెయ్యి కోట్లు సీఎం కేసీఆర్ ఇచ్చారని మంత్రి హరీష్ గుర్తుచేశారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంకలో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావుతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకుడు కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... ఆర్థిక మంత్రిగా అన్ని రకాలుగా అండగా‌ ఉంటానని మంత్రి హరీష్ హమీ ఇచ్చారు. 

''సీఎం కేసీఆర్ మత్స్యకారుల కోసం మోటార్ సైకిల్లు ఇస్తే... కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి వారిపై భారం వేసింది. అలాగే మేము మత్స్యకారులకు రూ.150 కోట్లతో లగేజ్ ఆటోలు ఇచ్చాము. రూ. 65 కోట్లతో హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇచ్చాము. రాబోయే రోజుల్లో అన్ని మండలాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇస్తాం'' అని హరీష్ హామీ ఇచ్చారు. 

read more తెలంగాణలో నీలివిప్లవం... మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత కేసీఆర్‌ దే: మంత్రి హరీష్

''రూ. 75 కోట్లతో మత్స్యకార భవనాలు మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చేప పిల్లల డబ్బులను కూడా మత్స్యకార సంఘాలకు ఇస్తాం. రేపటి నుంచి అన్ని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వేసే కార్యక్రమం చేపడుతాము. రైతు బీమా తరహాలో మత్స్యకారులకు కూడా రూ. 6 లక్షల భీమా పాలసీ తీసుకొస్తాం'' అని తెలిపారు. 

వీడియో

''త్వరలోనే 609 జీవో అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కు కల్పించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బిజెపికి ఓటు వేస్తే లాభం జరుగుతుందా.. టీఆర్ఎస్ కి ఓటు వేస్తే లాభం జరుగుతుందా? మీరే ఆలోచించాలి. పని చేసిన వాళ్ళు ఎవరూ.. చేయగలిగేవారు ఎవరో ఆలోచించాలి. త్వరలోనే వీణవంకలో అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తాం'' అని మంత్రి పేర్కొన్నారు. 

''రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలోనే పెన్షన్ అందుతుంది. వీణవంకలో 24/7 ఆస్పత్రిని వెంటనే మంజూరు చేశాం. మనల్ని కష్టంలో సుఖంలో ఆదుకునేది ఎవరో ఆలోచించాలి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ధరలను అమాంతం పెంచుతోంది. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చెబుతోంది. వీణవంకలో ఓట్లు అడిగే ముందు బిజెపి నాయకులు దొడ్డు వడ్లు కొంటామని కేంద్రంతో చెప్పించాలి'' అని హరీష్ డిమాండ్ చేశారు. 

''కరోనా సమయంలో ప్రజలను ఆదుకుంది సీఎం కేసీఆర్. తెలంగాణ కోసం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొట్లాడితే 130 కేసులు నమోదై జైళ్ల పాలయ్యాడు. గెల్లు శ్రీనివాస్ కు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఉంది. మీ తలలో నాలుకలా ఉండే వ్యక్తి శ్రీనివాస్. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ముదిరాజులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వాహనాలకు ఉచితంగా పెట్రోల్ ఇప్పించాలి. ముదిరాజ్ ల లూనాలకు బీజేపీ ఉచితంగా‌ 25 లీటర్ల పెట్రోల్ ఇస్తామని హమీ ఇవ్వండి'' అని హరీష్ సూచించారు. .

''కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే నర్సింగపూర్ కు బ్రిడ్జి.. వీణవంకలో సెంట్రల్ లైటింగ్ ను త్వరలోనే మంజూరు చేస్తాము. ఆర్థిక మంత్రిగా నేను మీకు హమీ ఇస్తున్నా... మీ కష్టసుఖాల్లో అండగా ఉంటానని'' అని హరీష్ తెలిపారు.