వెంటనే హుజురాబాద్ ఉపఎన్నిక జరపండి...లేదంటే..: ఈసీకి గోనే ప్రకాష్ రావు లేఖ
హుజురాబాద్ ఉపఎన్నికను వెంటనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ పై ఫిర్యాదు చేస్తూ ఈసీకి లేఖ రాశారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికను వెంటనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. అలాగే అధికార టీఆర్ఎస్ పార్టీపై కూడా ఫిర్యాదు చేస్తూ ఈసీకి లేఖ రాశారు ప్రకాష్ రావు.
''మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును ఉపఎన్నిక ద్వారా భర్తీ చేయాల్సి వుంది. అయితే ఎలాగయినా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార టీఆర్ఎస్ అక్రమాలకు తెరలేపింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ హుజురాబాద్ ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి వీరు ఖర్చుచేస్తున్న డబ్బులపై నిఘా పెట్టాలి... అక్రమాలు జరక్కుండా అడ్డుకోవాలి'' అని ఈసీని కోరారు ప్రకాష్ రావు.
''హుజురాబాద్ ఉపఎన్నికలను రాష్ట్ర పోలీసుల బందోబస్తుతో కాకుండా కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో జరపాలి. అప్పుడు ఎలాంటి అవకతవకలు లేకుండా ఉపఎన్నిక జరుగుతుంది. లేదంటే అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవడం ఎవరివల్ల కాదు'' అని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు గోనె ప్రకాష్ రావు వెల్లడించారు.
read more కేటీఆర్ కు చెక్ పెడుతూ... సీఎం సీటుపై కన్నేసిన ఎంపి సంతోష్: గోనె ప్రకాష్ సంచలనం (వీడియో)
ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కే తన మద్దతు వుంటుందని ప్రకాష్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కాలంలో అలుపెరుగకుండా శ్రమించిన వ్యక్తి ఈటెల అని ప్రశంసించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు కూడా ఈటలకే మద్దతిస్తారని అన్నారు.
''హుజురాబాద్ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందినది. అలాంటి చోట ఒక బీసీ నాయకుడు ఆరు సార్లు పోటీ చేసి గెలిచాడంటే ఆలోచించాలి. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నైతిక విలువలు కలిగినవారు. కాబట్టి అనూహ్య రీతిలో ఇంటెలిజెన్స్ కి కూడా అంతు పట్టని తీర్పునిస్తారు'' అన్నారు.
''టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ ను హుజురాబాద్ లో కాకుండా ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గంలో పెట్టాల్సింది. ఉపఎన్నిక దృష్ట్యా ఈటెలను ఓడించడానికే సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో దళిత బంధు ఇస్తున్నాడు. ప్రలోబాలకు లొంగకుండా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటెలను గెలిపించాలి'' అని గోనె ప్రకాష్ కోరారు.