కేటీఆర్ కు చెక్ పెడుతూ... సీఎం సీటుపై కన్నేసిన ఎంపి సంతోష్: గోనె ప్రకాష్ సంచలనం (వీడియో)
తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావు కన్ను పడిందని... అందువల్లే కేటీఆర్ వ్యతిరేకులను ఆయన ఒక్కతాటిపైకి తెస్తున్నారని మాజీ ఆర్టీసి ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కన్ను ముఖ్యమంత్రి పదవి పడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ ను కలవాలంటే సంతోష్ అనుమతి పొందాల్సిందేనని... లేదంటే కేసీఆర్ అపాయింట్ మెంట్ లభించదన్నారు. చివరకు ఇంటలిజెన్స్ సమాచారం కూడా సీఎంకు సంతోష్ కుమార్ ద్వారానే వెళ్తుందని ప్రకాష్ రావు తెలిపారు.
వీడియో
సంతోష్ కుమార్ తో సహా ఆయన కుటుంబ సభ్యులు వేల కోట్లు ఆర్జించారని ప్రకాష్ రావు ఆరోపించారు. అంతేకాదు తన అధికారాలను ఉపయోగించి సంతోష్ అమాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. తక్షణమే దళితులపై పెట్టించిన కేసులు ఎత్తివేయించడమే కాదు తక్షణమే అక్రమ దందాలు ఆపాలని ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సంతోష్ కు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు
ఇక హుజురాబాద్ ఉపఎన్నికపైనా ప్రకాష్ రావు స్పందించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు తాను బహిరంగంగా మద్దతు తెలుపుతున్నానని అన్నారు. రానున్న ఉపఎన్నికలో తప్పకుండా ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు.
50 లక్షల మందికి నేరుగా ప్రెస్ మీట్ ద్వారా సమాచారం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ప్రకాష్ రావు వెల్లడించారు. గత రాజకీయ జీవితంలొనే కాదు భవిష్యత్తులోనూ ఎలాంటి సీక్రెట్స్ ఉండవు కాబట్టి తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.