ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు మళ్లీ దిమ్మతిరిగే షాక్
- చెన్నమనేని భారత పౌరసత్వం గతంలోనే రద్దైంది
- రివ్యూ పిటిషన్ ను రద్దు చేసిన కేంద్ర హోంశాఖ
- చెన్నమనేని పచ్చి మోసగాడంటూ ఆది శ్రీనివాస్ విమర్శ
వేములవాడ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రావు కు మరోసారి దిమ్మతిరిగే షాక్ తగిలింది. గతంలో జర్మనీ పౌరుడైన చెన్నమనేని రమేష్ కు ఉన్న భారత పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ ఈ విషయాన్ని గతంలో ప్రకటించింది. దీనిపై గతంలోనే హోంశాఖ సంయుక్త కార్యదర్శి రమేష్ కు ఒక లేఖ రాశారు. ఆయనకు జర్మనీ పౌరుడు. అయితే, భారత పౌరసత్వం సంపాదించారు. దీనికి తప్పుడు ప్రతాలు వాడారన్నది ఆభియోగం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునన కేంద్ర సర్కారు చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది.
రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని హైకోర్టులో చాలెంజ్ చేశారు చెన్నమనేని. అయితే ఆయనకు హైకోర్టులో కొద్దిగా వెసులుబాటు దక్కింది కానీ... కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేయలేదు. ఇదే విషయమై చెన్నమనేని కేంద్ర హోంశాఖకు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. రివ్యూ పిటిషన్ ను హోంశాఖ కొట్టేసింది. దీంతో ఆయనకు ఉన్న భారత పౌరసత్వం తప్పుడు మార్గాల్లో వచ్చిందేనని కేంద్రం మరోసారి వెల్లడించింది.
చెన్నమనేని పచ్చి మోసగాడు : ఆది శ్రీనివాస్
చెన్నమనేని రమేష్ పచ్చి మోసగాడు అని బిజెపి నేత ఆది శ్రీనివాస్ ఆరోపించారు. చెన్నమనేని పౌరసత్వం విషయంలో ఆది శ్రీనివాస్ పట్టువదలని విక్రమార్కుడి వలే పోరాడుతున్నారు. తాజాగా రివ్యూ పిటిషన్ ను కేంద్ర హోంశాఖ కొట్టేయడంతో తక్షణమే చెన్నమనేని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేములవాడ ప్రజలనే కాకుండా యావత్ భారత దేశ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. భారత చట్టాలను కూడా మోసం చేసిన చెన్నమనేనిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.