హెటిరో గ్రూప్లో ఐటీ దాడులు.. లెక్కకు రాని రూ. 550 కోట్లు లభ్యం!
హైదరాబాద్కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ హెటిరో గ్రూప్ ఐటీ తనిఖీల్లో పెద్దమొత్తంలో లెక్కల్లో లేని సొమ్ము వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ నెల 6న జరిపిన ఐటీ దాడుల్లో సంస్థకు చెందిన చిట్టాల్లో లేని సుమారు రూ. 550 కోట్ల వరకు లభ్యమైనట్టు ఐటీ వర్గాలు వివరించాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫార్మా దిగ్గజం హెటిరో గ్రూప్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ఆస్తుల్లో జరిగిన ఐటీ సోదాల్లో లెక్కకురాని భారీ నగదు లభ్యమైనట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆరు రాష్ట్రాల్లో hetero groupనకు చెందిన స్థలాల్లో తనిఖీలు జరిగాయి.
ఈ సోదాల్లో అనేక బ్యాంకు లాకర్లు వెలుగులోకి వచ్చాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 16 లాకర్లు నిర్వహణలో ఉన్నట్టు తెలిసిందని తెలిపింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో లేని రూ. 142.87 కోట్లు బయటపడ్డట్టు పేర్కొంది. ఈ సోదాల్లో మొత్తం సుమారు లెక్కకు రాని రూ. 550 కోట్లు తేలినట్టు తెలిపింది. ఇవి pharma group హెటిరోకు చెందినవని ఐటీవర్గాలు తెలిపాయి.
అయితే, ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని ఆ వర్గాలు వివరించాయి. బోగస్ సంస్థల నుంచి నిజంగా ఉనికిలో లేని సంస్థల నుంచి కొనుగోళ్లు జరిపినట్టు లెక్కలున్నట్టు తెలిసిందని, అలాగే, కొన్ని ఖర్చులు చూసే శాఖల్లోనూ ఎక్కువ మొత్తంలో బిల్లులున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నాయి. భూముల కొనుగోళ్ల వ్యవహారమూ గుర్తించినట్టు తెలిపాయి.
వ్యక్తిగత కొనుగోళ్లనూ కంపెనీ చిట్టాలో చూపెట్టడం, సంబంధిత పార్టీల భూముల కొనుగోళ్లనూ ఈ లెక్కల్లోనే చూపినట్టు వెలుగులోకి వచ్చాయని వివరించాయి. కాగా, గుట్టుగా దాచిపెట్టిన కొన్ని దస్త్రాలనూ కొనుగొన్నామని, అందులో సెకండ్ సెట్ అకౌంట్ బుక్కులు, నగదు ఉన్నట్టు తెలిపాయి.