తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు మోసం చేస్తున్నారని.. తెలంగాణ వద్దన్న తమ గురువుల బాటలో నడుస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

గజ్వేల్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనం రాష్ట్ర మంత్రి హరీశ్ రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ ల మీద విరుచుకుపడ్డారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు, వేలాది మంది రైతుల చావుకు కారణమైందన్నారు. 

మూడు గంటల కరెంటు చాలని చెప్పి.. తెలంగాణ ప్రజలకు శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని ఆయా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తీరుపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. మూడు పంటలు పండాలని కోరుకునే కేసీఆర్ ను కడుపులో పెట్టి చూసుకుందామన్నారు. తెలంగాణ ప్రజా సంక్షేమంపై ముందు చూపుతో ఎవరు వ్యవహరిస్తున్నారో.. ప్రజలే ఆలోచన చేయాలన్నారు. 

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు బీజేపీ కిషన్ రెడ్డిలు తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని, సద్దితిన్న రేవు తలవాలని సీఎం కేసీఆర్ ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు. 

ఓవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ సమైక్యాంధ్ర సీఎం చంద్రబాబు గురువని ఆయన చెప్పినట్లు వింటున్నారంటూ.. వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ సీఎంలైన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువ బెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.