హైదరాబాద్‌లో స్లో పాయిజనింగ్‌తో ఓ కుటుంబాన్ని అంతం చేయాలని దగ్గరి బంధువులే ప్రయత్నించిన ఘటన వెలుగుచూసింది. ఈ విషయం వెలుగుచూడటంలో  గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ వేమూరి రామ తారకనాథ్ కీలక పాత్ర పోషించారు.

హైదరాబాద్‌లో స్లో పాయిజనింగ్‌తో ఓ కుటుంబాన్ని అంతం చేయాలని దగ్గరి బంధువులే ప్రయత్నించిన ఘటన వెలుగుచూసింది. ఈ విషయం వెలుగుచూడటంలో గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ వేమూరి రామ తారకనాథ్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆ కుటుంబంలోని నలుగురు సభ్యుల ప్రాణాలను రక్షించడంలో సహాయంగా నిలిచారు. ఈ ఘటనకు సంబందించి విచారణ జరిపిన పోలీసులు.. అసలు సూత్రధానిని కూడా గుర్తించారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. 

వివరాలు.. ఈ కేసు యువ వధువు కవితకు సంబంధించినది (పేరు మార్చబడింది). జూన్‌లో కవిత వివాహం జరిగింది. ఆమె భర్త శేఖర్ (పేరు మార్చబడింది) యూఎస్‌లో ఇంజనీర్‌గా ఉన్నారు. ఆమె వదిన రవీనా(పేరు మార్చబడింది) యూకే‌లో వైద్యురాలుగా సేవలు అందిస్తున్నారు. రవీనా హెల్త్ కేర్ రంగానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక, కవిత అత్తమామలు సుబ్బారావు, జానకిలు తరచుగా భారతదేశం నుంచి యూఎస్, యూకేలకు ప్రయాణిస్తూ ఉంటారు. 

కవిత వివాహం తర్వాత.. కుటుంబ సభ్యులందరూ గ్యాస్ట్రోఎంటెరిటిస్, కడుపు తిమ్మిరి, కాళ్ళు, చేతులు లాగడం వంటి సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. సుబ్బారావు, శేఖర్, రవీనా, కవిత కోలుకున్నారు. అయితే జానకీ మాత్రం కోలుకోలేకపోయింది. తర్వాత శేఖర్ యూఎస్‌కు వెళ్లడం, రవీనా యూకేకు వెళ్లిపోయారు. జానకిని సుబ్బారావు చూసుకోవడం మొదలుపెట్టారు. భర్త యూఎస్ వెళ్లడంతో కవిత స్వగ్రామమైన గుంటూరులోని నరసరావుపేటకు తిరిగి వచ్చింది.

ఆ తర్వాత జానకి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు గులియన్ బారే సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత జానకి వెంటనే మరణించింది. అయితే ఆమె మృతికి పల్మనరీ ఎంబోలిజమ్‌ అయి ఉంటుందని వైద్యులు భావించారు. జానకీ మరణం అనంతరం.. హైదరాబాద్ మియాపూర్‌లో కుటుంబసభ్యులు సమావేశమయ్యారు. కవిత నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. అయితే అంతా ఒక్కసారిగా మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారంతా ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం రవీనా, శేఖర్ విదేశాలకు వెళ్లగా.. కవిత నరసరావుపేటకు తిరిగి వచ్చింది.

ఇక, కవిత తన అవయవాలలో తీవ్రమైన నరాల నొప్పిని ఎదుర్కొంది. ఆమె గోళ్లపై అస్పష్టమైన తెల్లని గీతలను గమనించింది. ఈ క్రమంలోనే ఇటీవల డాక్టర్ తారకనాథ్ వద్దకు వచ్చింది. తీవ్రమైన మంట, జలదరింపు అనుభూతి, చేతులు, కాళ్ళు తిమ్మిరి ఉన్నట్టుగా పేర్కొంది. దీంతో డాక్టర్ తారకనాథ్ ఆమె పూర్తి క్లినికల్ హిస్టరీని తీసుకున్నారు. అయితే ఆమెలో ఆర్సెనిక్ విషం లక్షణాలు రోగనిర్ధారణ అయింది. ల్యాబ్ పరీక్షలు కూడా ఆర్సెనిక్ ఉనికిని నిర్ధారించాయి. కవిత కుటుంబంలో ఒకరి మరణానికి, నలుగురి అనారోగ్యానికి స్లో పాయిజనే కారణమని తేలింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

హైదరాబాద్‌లో కవిత కుటుంబం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. వాచ్‌మెన్ కొడుకు కొంతమంది అపరిచితులతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. దీంతో వాచ్‌మెన్ కుమారుడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అదే అపార్ట్‌మెంట్‌లో సుబ్బారావు కుటుంబానికి చెందిన ఓ బంధువు అతడిని ఈ పని చేయమన్నట్టుగా తేలింది. 

అయితే కవిత వదిన రవీనా నుంచి విడిపోయిన భర్తే.. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా నిర్దారణ అయింది. అతడు ఒక ఫార్మసిస్ట్.. ఆర్సెనిక్‌ను విషం ద్వారా ఆ కుటుంబాన్ని అంతమొందించాలని వాచ్‌మెన్ కొడుకు, మరికొంత మందితో కలసి కుటుంబానికి చెందిన అసంతృప్త బంధువుకు మార్గనిర్దేశం చేసినట్టుగా తేలింది.