సర్పంచ్ ఎన్నికలు జర్రంత దూరం పోతున్నయా ?
రిజర్వ్ సర్పంచ్ స్థానాల సంఖ్యను జిల్లాలవారీగా ప్రకటించనున్న కమిషనర్
జిల్లా స్థాయిలో రిజర్వ్ వార్డు మెంబర్ల సంఖ్యను ప్రకటించనున్న కలెక్టర్
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష
జూన్ 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్దమౌతోంది. ఈ నెలాఖరులోగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసి... వచ్చే నెల 10 లోపు సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, హరితహారం, ఎల్ ఈ డీ వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై తెలంగాణా గ్రామీణాభివృద్ధి సంస్థలో ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సమీక్ష నిర్వహించారు.
2011 గ్రామీణ జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికారులు వివరించారు. అలాగే ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన జరుగుతుందని, నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 10 నాటికి జిల్లాలవారీగా సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల సంఖ్యను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్, వార్డుమెంబర్ల సంఖ్యను జిల్లా స్థాయిలో మండలాలవారీగా కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
