కొత్త సంవత్సరం నుంచి కొత్త హైదరాబాద్ అనుభూతి అందిస్తామని జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు.

వందరోజుల్లో హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీలను దారికి తెస్తానని కొత్త మునిసిపల్ మినిష్టర్ కె టి రామారావు చేసిన చారిత్రాత్మక ప్రకటన తర్వాత , మరొక చారిత్రాత్మక ప్రకటన విడుదలయింది.

డిసెంబర్ 31 వ తేదీ రాత్రిపొద్దు పోయే దాకా కొత్తసంవత్సర వేడుకులు చేసుకుని, మరుసటి పొద్దున లేచే సరికి... సరికొత్త హైదరాబాద్ కనబడేలా చేస్తామని చెబుతున్నారు జిహెచ్ఎంసి వారు. 

ఇక్కడ నోటీసులు అంటించరాదు, ఇక్కడ ఉచ్చలు పోయరాదు, పోటీ పరీక్షలకు కోచింగ్ లు, గుప్త వ్యాధులకు చికిత్స, టిఆర్ ఎస్,కాంగ్రెస్ నాయలకు స్వాగతం వంటి గోడరాతలు కనిపించకుండా చేస్తామని జిహెచ్ఎంసి చెబుతా ఉంది. ఇవి సిటి అందాన్ని నాశనం చేయడమే కాదు, భాషను కూడా హింసిస్తూ ఉంటాయనేది వేరేవిషయం (పై ఫోటో).

నాయకులు జన్మదిన శుభాకాంక్షల తెలిపే ఫ్లెక్సీలు కూడా కనిపించవట.(ఇది మొదటిసారి కాదులే...)

కొత్త సంవత్సరం నుంచి కొత్త అనుభూతి అనే నిర్ణయం బల్దియా తీసుకుంది. ఇష్టానుసారం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, గోడలపై రాతలు, హోర్డింగులు, కటౌట్లను నిషేధించినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు లేదా జరిమానా విధిస్తామని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి చెబుతున్నారు.

అయితే, బుధవారం నాటి అఖిలపక్ష సమావేశం లో తెదేపా, సీపీఎం పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అయినా సరే మేం మాత్రం ముందుకు పోతామని జనవరి 1వ తేదీ నుంచి మార్పు తీసుకువస్తామని కమిషనర్ చెబుతున్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతల మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. 

కమిషన్ జనార్దన్ రెడ్డి వరంగల్, అనంతపురం కలెక్టర్ గా ఉన్నపుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే,హైదరాబాద్ ఆయనకు అచ్చొచ్చినట్లు లేదు. మహానగరాన్ని ఇంకా మచ్చిక చేసుకోలేక పోతున్నారు. ఆయన విజయవంతం కావాలనే కోరుకుందాం.