దానం నాగేందర్ కి జీహెచ్ఎంసీ షాక్
ఇలా టీఆర్ఎస్ లోకి చేరారో లేదో..
మాజీ మంత్రి దానం నాగేందర్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసినందుకుగాను మాజీ మంత్రి దానం నాగేందర్ అనుచరులకు జీహెచ్ఎంసీ పెనాల్టీ విధించింది. అధికార టీఆర్ఎస్ పార్టీలో దానం చేరిన సందర్భంగా ఆయన అభిమానులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచి తెలంగాణ భవన్, బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై ఆయన అభిమానులు జీ నాగేంద్ర, వీ మోహన్రెడ్డిలు అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసినందుకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.30 వేలు జరిమానా విధించారు. గతంలో కూడా పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికీ పెనాల్టీ విధించారు.