నడ్డాతో భేటీ: అమిత్ షా సమక్షంలో బిజెపిలోకి విజయశాంతి
కాంగ్రెసు నేత, మాజీ ఎంపీ విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయమైందని అంటున్నారు. విజయశాంతి రేపు అమిత్ షా సమక్షంలో హైదరాాబాదులో బిజెపిలో చేరే అవకాశాలున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి రేపు ఆదివారం కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆమె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా సమక్షంలో హైదరాబాదులోనే బిజెపిలో చేరుతారు. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో సమావేశమైన విషయం తెలిసిందే.
జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం అమిత్ షా రేపు హైదరాబాదు వస్తున్నారు. ఆయన తొలుత హైదరాబాద్ పాతబస్తీలో గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా విజయశాంతి ఆయన సమక్షంలో బిజెపిలో చేరుతారు.
ఇప్పటికే విజయశాంతి బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డాతో ఆమె సమావేశమయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇచ్చే విషయంపై ఆమె నడ్డాతో చర్చించినట్లు తెలుస్తోంది. నడ్డా నుంచి ఆమె హామీ తీసుకున్నట్లు చెబుతున్నారు.
చాలా కాలంగా ఆమె కాంగ్రెసు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దుబ్బాక శాసన సభ ఉప ఎన్నికలో ఆమె ప్రచారం చేయలేదు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మీద మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు.