జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలు ముగిశాయి. సమావేశాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి అర్దాంతరంగా ముగించారు.

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలు ముగిశాయి. సమావేశాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి అర్దాంతరంగా ముగించారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమైనప్పటీ నుంచే తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో విపక్ష కార్పొరేటర్ల ఆందోళనల మధ్యనే రూ. 6,624 కోట్ల 2023-2024 వార్షిక బడ్జెట్‌కు జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్టుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. దీంతో ఎటువంటి చర్చ లేకుండానే బడ్జెట్‌‌కు ఆమోదం పొందినట్టయింది. 

ఈ రోజు ఉదయం జీహెచ్‌ఎంసీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే.. సభలో గందరగోళం నెలకొంది. సమావేశాలను బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. నగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ వారిని వారించే ప్రయత్నం చేశారు. 

మరోవైపు బడ్జెట్ ఆమోదం పొందినట్టుగా మేయర్ ప్రకటించడంపై.. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదంపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సభలో బీజేపీ, టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. 

ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొడియం వద్దకు వచ్చిన సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లాలని మేయర్ సూచించారు. మేయర్ పోడియం దగ్గరకు రావడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరగాలి అనుకుంటే అందరూ సహకరించాలన్నారు. బీజేపీ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్ ను ఆదేశించారు.