ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల మీద నలుగురు ఉపాధ్యాయులు, ఆ స్కూలు బస్సు డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టారు.
మహబూబాబాద్ : తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ నలుగురు ఉపాధ్యాయులు తమ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. వీరికి ఆ స్కూలు బస్సు డ్రైవర్ కూడా జతయ్యాడు. మరిపెడ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ ఘటన వెలుగు చూసింది. టీచర్లు విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు ఉపాధ్యాయులతో పాటు, వారితో కలిసి వేధింపులకు పాల్పడుతున్న స్కూల్ బస్సు డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతకుముందు పాఠశాలకు వెళ్లి తమ పిల్లల చెప్పిన ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ఈ విషయం మీద నిలదీశారు. తీవ్ర అగ్రహావేషాలతో ఉపాధ్యాయుల మీద దాడికి దిగారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలిసి రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉపాధ్యాయులతో పాటు స్కూలు బస్సు డ్రైవర్ ని ఎస్సై ఝాన్సీ అదుపులోకి తీసుకున్నారు.
మెడికో ఆత్మహత్యాయత్నం ఘటనపై నోరుజారిన బండి సంజయ్.. ఇంతకీ ఏమన్నారంటే..?
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వారి మీద ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ మేరకు మరిపెడ సీఐ సాగర్ వివరాలు తెలియజేశారు. ఈ ఘటన జరగడానికి ముందు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, జిల్లా చైల్డ్ లైన్ విభాగం ఐసిడిఎస్ అధికారులు పాఠశాలను సందర్శించారు. వేధింపులకు సంబంధించి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు డిసెంబర్ లో గుంటూరులో వెలుగు చూసింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి నీచానికి దిగజారాడు. మంచి చెడు చెప్పాల్సిన స్కూలు ప్రిన్సిపాల్ గాడి తప్పి వ్యవహరించాడు. తన స్కూల్లో చదివే ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు కీచక ప్రధానోపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. దీని మీద పోలీసు కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది.
ఆ స్కూల్లో షేక్ అబ్దుల్ షాజహాన్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. అతను గుంటూరు ఆనందపేటకు చెందినవాడు. చిన్నారి అని కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో బాలిక భయపడిపోయింది. స్కూల్ కి వెళ్లడానికి భయపడుతుంది. వారం రోజులుగా ఏదో ఒక సాకుతో స్కూలుకు వెళ్లడం లేదు. అమ్మాయి డల్ గా ఉండడం.. భయపడుతూ ఉండడంతో ఆమె తల్లి.. జ్వరంవల్లేమో అనుకుంది. జ్వరం మందులు వేసింది.అయినా కూడా చిన్నారి ఈ విషయంలో మార్పు లేకపోవడంతో… అసలు విషయం ఏంటి అని అనునయించి అడిగింది.
దీంతో బాలిక ఏడుస్తూ విషయం చెప్పింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు స్కూల్ దగ్గరికి వెళ్లి ప్రధానోపాధ్యాయుని విషయం ఏంటని ఏమిటని నిలదీశారు. తనకేం తెలియదని బుకాయించబోయాడు. దీంతో ఆగ్రహానికి వచ్చిన అందరూ.. కలిసి అతనికి దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని పట్టాభిపురం పోలీసులకు తెలిపారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని మొదట ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స చేయించి.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
