కాంగ్రెస్కి మరో షాక్: బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ విషయమై తన అనుచరులకు విశ్వేశ్వర్ రెడ్డి సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్: చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ విషయమై తన అనుచరులకు విశ్వేశ్వర్ రెడ్డి సమాచారం ఇచ్చారు.
హైద్రాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న చిన్నారెడ్డికి నష్టం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ విషయాన్ని ఎన్నికల తర్వాత సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తోంది.
గతంలో కూడ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే తనకు అన్ని పార్టీల్లో స్నేహితులున్నారని ఆయన ప్రకటించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఆయన టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అప్పటి మంత్రి మహేందర్ రెడ్డితో విబేధాల కారణంగానే ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారని ప్రచారం సాగింది. 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీ స్థానం నుండి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత కాలంలో పలు దఫాలు కాంగ్రెస్ కు దూరమౌతారనే ప్రచారం కూడ సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. కొంతకాలంగా బీజేపీ నేతలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి టచ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.