షాక్: కాంగ్రెస్కి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం నాడు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం నాడు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది.
కొద్దిసేపటి క్రితమే ఆయన తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. అయితే చిన్నారెడ్డికి ఈ ఎన్నికల్లో నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించలేదు.
మూడు మాసాల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని విశ్వేశ్వర్ రెడ్డి నిర్ణయించుకొన్నారు. ఈ సమయంలో తన వ్యాపార కార్యక్రమాలపై కేంద్రీకరించే అవకాశం ఉందని సమాచారం.
also read:కాంగ్రెస్కి మరో షాక్: బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మూడు మాసాల తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ భూపేందర్ యాదవ్ తో ఆయన సమావేశమయ్యారు.
చేవేళ్ల ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసేందుకు బీజేపీ నాయకత్వం హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ హామీ కారణంగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారు. త్వరలోనే తాను బీజేపీలో చేరుతానని తన అనుచరులకు విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు.