పాలేరులోని ఓ ఫంక్షన్ హాల్ లో  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు   మంగళవారంనాడు సమావేశమయ్యారు. తుమ్మల నాగేశ్వరరావుకు  పాలేరు టిక్కెట్టు దక్కలేదు. దీంతో  ఈ సమావేశానికి  ప్రాధాన్యత నెలకొంది. 

ఖమ్మం: పాలేరులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు మంగళవారంనాడు సమావేశమయ్యారు. పాలేరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టిక్కెట్టు దక్కింది. ఈ స్థానం నుండి పోటీ చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు కేటాయించలేదు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఇవాళ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2016లో పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు.

2018 లో ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈ దఫా ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని ఆయన రంగం సిద్దం చేసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కందాల ఉపేందర్ రెడ్డికే టిక్కెట్టు కేటాయించారు.

2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి కేబినెట్ లోకి తీసుకున్నారు కేసీఆర్. అయితే ఆ తర్వాత అనారోగ్యంతో పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించారు. దీంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. కానీ, 2018లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలు కావడం రాజకీయంగా ఆయనకు ఇబ్బందిగా మారింది. గత నాలుగున్నర ఏళ్లుగా తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ కీలక పదవిని ఇస్తారనే ప్రచారం సాగింది.

కానీ, ఆయనకు ఎలాంటి కీలక పదవి దక్కలేదు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు. అయితే పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కలేదు. దీంతో పాలేరులోని తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఇవాళ సమావేశమయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.