Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లోకి: కోమటిరెడ్డితో ఎఐసీసీ కార్యాలయానికి మోత్కుపల్లి

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  ఇవాళ ఎఐసీసీ కార్యాలయానికి వచ్చారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నర్సింహులును ఎఐసీసీ కార్యాలయానికి తీసుకొచ్చారు.

Former Minister  Motkupalli Narasimhulu  Reaches  AICC Office  lns
Author
First Published Oct 27, 2023, 9:59 AM IST

న్యూఢిల్లీ:  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం నాడు ఉదయం ఎఐసీసీ కార్యాలయానికి వచ్చారు.  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మోత్కుపల్లి నర్సింహులును  ఎఐసీసీ కార్యాలయానికి తీసుకు వచ్చారు.  కాంగ్రెస్ పార్టీలో చేరాలని  తనకు ఆహ్వానం వచ్చిందని  గతంలోనే మోత్కుపల్లి నర్సింహులు  ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది సెప్టెంబర్ 29న కర్ణాటక డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ తో  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు.  కాంగ్రెస్ లో చేరాలని మోత్కుపల్లి నరసింహులు భావిస్తున్నారు.  1983లో  మోత్కుపల్లి నరసింహులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. టీడీపీ ద్వారా నరసింహులు  రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో  ఆరు దఫాలు  ఆయన  ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  టీడీపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ గా  నరసింహులు  విజయం సాధించారు.  ఆలేరు, తుంగతుర్తి అసెంబ్లీ స్థానాల నుండి  టీడీపీ అభ్యర్ధిగా  ఆయన విజయం సాధించారు.

 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  తుంగతుర్తి నుండి  ఆయన టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.  2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి  మోత్కుపల్లి నరసింహులు ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడ ఆయన టీడీపీలో ఉన్నారు.ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో  మోత్కుపల్లి నరసింహులు  టీడీపీని వీడి  బీజేపీలో చేరారు. బీజేపీలో  పరిణామాలపై అసంతృప్తితో  మోత్కుపల్లి నరసింహులు  బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ తీరుపై కూడ మోత్కుపల్లి నరసింహులు అసంతృప్తితో ఉన్నారు.

also read:కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మోత్కుపల్లి భేటీ: వచ్చే నెలలో కాంగ్రెస్‌లోకి

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  ఆలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని నరసింహులు భావించారు. బీఆర్ఎస్ టిక్కెట్టు మాత్రం  నరసింహులుకు దక్కలేదు. దీంతో  ఆయన  కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.  కాంగ్రెస్ నేతలు కూడ  మోత్కుపల్లితో టచ్ లోకి వెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి మోత్కుపల్లి నరసింహులు ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది. 

రేవంత్ రెడ్డి టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మోత్కుపల్లి నరసింహులు  టీడీపీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలపై  మోత్కుపల్లి నరసింహులు  పార్టీ సమావేశాల్లో  తీవ్ర విమర్శలు చేశారు.  అయితే  తనకు  రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని మోత్కుపల్లి నరసింహులు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. రేవంత్ రెడ్డి తన సోదరుడని ఆయన  ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios