దూకుడు పెంచిన మోత్కుపల్లి: ప్లాన్ ఇదే...
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న మోత్కుపల్లి
భువనగిరి: తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తన అనుచరులతో బుధవారం నాడు ఆలేరులో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణను మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించే అవకాశం ఉంది.
గత నెల 28వ తేదిన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు టిడిపి నేతలు కౌంటరిచ్చారు. ఈ విమర్శలు చేసినందుకు గాను నర్సింహులును పార్టీ నుండి బహిష్కరిస్తూ టిడిపి నాయకత్వం నిర్ణయం తీసుకొంది.
మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ లో చేరే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా టిడిపి చీఫ్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారని, గతంలో కూడ టిఆర్ఎస్ లో టిడిపి తెలంగాణ శాఖను విలీనం చేయాలని వ్యాఖ్యలు చేశారని తెలంగాణ టిడిపి నేతలు ఆరోపణలు చేశారు.
టిడిపి నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు బుధవారం నాడు ఆలేరులో తన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆలేరు నియోజకవర్గం జనరల్ కేటగిరిలోకి మారింది. దీంతో ఆనాడు టిడిపి టిఆర్ఎస్ మధ్య పొత్తు కారణంగా నర్సింహులు తుంగతుర్తి నుండి టిడిపి నుండి అభ్యర్ధిగా పోటీచేసిన నర్సింహులు విజయం సాధించారు. 2014 లో ఖమ్మం జిల్లా మధిర నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు భట్టి విక్రమార్కపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుండి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆలేరు మండలంలోని 8 మండలాలకు చెందిన అనుచరులతో సమావేశం కావాలని భావిస్తున్నారు. ఈ మేరకు తన అనుచరులకు సమాచారాన్ని పంపారు.
ఎన్టీఆర్ 1989లో మోత్కుపల్లి నర్సింహులుకు టిక్కెట్టు ఇవ్వలేదు.ఆ ఎన్నికల్లో నర్సింహులు స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 1994లో టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించారు. టిడిపిగా విజయం సాధించిన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యుడిగా కొనసాగారు. మరోవైపు 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి ఆలేరు నుండి విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అసెంబ్లీలో టిడిపి అభ్యర్ధిగా కొనసాగారు.
2004లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009లో టిడిపి అభ్యర్ధిగా తుంగతుర్తి నుండి పోటీ చేసి విజయం సాధించారు. పార్టీలు మారినా, స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేసినా ఆలేరు నుండి మోత్కుపల్లి నర్సింహులు విజయం గతంలో విజయం సాధించారు.
బుధవారం నాడు ఆలేరులో తన అనుచరులతో మోత్కుపల్లి నర్సింహులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలను ఆహ్వానించారు. అయితే స్వతంత్రంగా నర్సింహులు పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకొంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రజా వేదికను ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే టిడిపిలో ఉన్న క్యాడర్, నేతలు ఏ మేరకు నర్సింహులు వెంట సాగేందుకు ముందుకు వస్తారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.