నారాయణఖేడ్లోని కస్తుర్భా బాలికల హాస్టల్ ఫుడ్ పాయిజన్.. 35 మందికి అస్వస్థత.. చర్యలు చేపట్టిన డీఈవో
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 35 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 35 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు కొందరు వాంతులు చేసుకోగా.. మరికొందరు కడుపునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వసతి గృహం సిబ్బంది అనారోగ్యానికి గురైన విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అక్కడ ప్రస్తుతం విద్యార్థులు చికిత్స కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం టిఫిన్గా పెట్టిన అటుకుల ఉప్మాలో పురుగులు వచ్చినట్టుగా విద్యార్థినిలు తెలిపారు.
అయితే విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి, వసతి గృహానికి వచ్చి వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అయితే కొందరు విద్యార్థినులను వారి కుటుంబ సభ్యులు హాస్టల్ నుంచి తీసుకెళ్లిపోతున్నారు. పురుగుల తిండి తినలేక ఇంటికి వెళిపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని చెప్పారు.
నారాయణఖేడ్లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన డీఈవో చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను డీఈవో పరామర్శించారు ఇందుకు బాధ్యులైన ఐదుగురు హాస్టల్ సిబ్బందిని తొలగించనున్నట్టుగా చెప్పారు. అలాగే పుడ్ పాయిజన్ ఘటనపై స్పెషల్ ఆఫీసర్లతో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు.