ఫ్లోరోసిస్ బాధితుడు అంశాలస్వామి కన్నుమూత.. కేటీఆర్ సంతాపం..
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి ఇక లేరు. బైక్ మీదినుంచి పడడంతో ఆయన మృతి చెందారు. శనివారం ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ : ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆయన వయసు 32 సంవత్సరాలు. అయితే, ఆయన బైక్ మీదినుంచి పడడం వల్ల చనిపోయారని సమాచారం. నల్గొండ జిల్లా ప్లోరోసిస్ విముక్త పోరాట కమిటీ నాయకుడు అంశాల స్వామి.
అంశాల స్వామి మృతిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఫ్లోరోసిస్ బాదితుడై, వారికోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అంశాలస్వామి. ఎంతో మందికి స్పూర్తి ఆయన. అంశాలస్వామి ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని అని కోరుకున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ లో అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరైడ్ బాధితుడైన అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో కలిసి భోజనం చేశారు. మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల సందర్భంగా మునుగోడు వెళ్లిన కేటీఆర్.. ఆ తర్వాత శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామిని కలిశారు. ఆయన తల్లితండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఆ సందర్భంగా కాసేపు అంశాల స్వామితో కేటీఆర్ మాట్లాడారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, హెయిర్ కటింగ్ సెలూన్, ఇంటి నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలోనూ అంశాల స్వామి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆర్థిక సహాయం కూడా చేశారు. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ. 5.50 లక్షలు మంజూరు కూడా చేయించారు. మిగతా ఇంటి నిర్మాణ పనులను కేటీఆర్ కార్యాలయంతో పర్యవేక్షించి పూర్తయ్యేలా చొరవ కూడా చూపారు.\