Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో పదికి పెరిగిన మరణాలు

సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

fire accident at a hotel, kills seven and ten injured in Secunderabad
Author
First Published Sep 13, 2022, 6:43 AM IST

హైదరాబాద్ :  సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 8కి పెరిగింది. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల లోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఏ. హరీష్,  చెన్నై వాసి సీతారామన్ ఢిల్లీ వాసి వీతేంద్ర  ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాలు షోరూంలో చెలరేగిన మంటలతో.. పై అంతస్తులో ఉన్న లాడ్జీలో పర్యాటకులు ప్రమాదం బారిన పడ్డారు. పొగ దట్టంగా వ్యాపించడంతో పలువురు స్పృహ కోల్పోయి లాడ్జిలోని గదులు,  ఆవరణలో పడి ఉన్నారు. క్షతగాత్రులను గాంధీఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోండా మార్కెట్ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి…సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ఫ్రైడ్ పేరిట ఐదు అంతస్తుల భవనం ఉంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో  హోటల్ నిర్వహిస్తున్నారు.  

సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో అగ్నిప్రమాదం.. పై అంతస్తులో చిక్కుకున్న కొందరు, రెస్క్యూ ఆపరేషన్

సోమవారం రాత్రి  9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇవి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షో రూమ్ లోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల  మంటల ఉధృతి మరింత పెరిగింది. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. మెట్ల మార్గం ద్వారా పైఅంతస్తులకు వ్యాపించాయి. దీనికి తోడు వాహనాలు,  బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే  అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి.

ఆ సమయంలో లాడ్జిలో 25 మంది …
లాడ్జిలో మొత్తం ఇరవై మూడు గదులు ఉన్నాయి. వీటిలో దాదాపు 25 మంది పర్యాటకులు ఉన్నట్లు అంచనా. ప్రమాదంతో ఒక్కసారిగా హోటల్లోని పర్యాటకులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు చేయసాగారు.  విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో ఏమైందో అని భయాందోళనకు గురయ్యారు. వాహనాల నుంచి వెలువడిన  పొగ కారణంగా ఊపిరి ఆడక  కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో,  కారిడార్లో పడిపోయారు. దట్టంగా పొగ చూడడంతో శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఏడుగురు పర్యాటకులు చనిపోయారు. మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కిందికి దూకి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు హైడ్రాలిక్ క్రేన్  తీసుకువచ్చి లాడ్జిలో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 గాంధీ ఆసుపత్రిలో చికిత్స
క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 30 మంది వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందిస్తున్నట్లు  గాంధీ హాస్పిటల్ సూపర్డెంట్ రాజారావు వివరించారు. 

మంత్రుల పరామర్శ..
ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని,  క్షతగాత్రులను గాంధీ, యశోద ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నగర సీపీ ఆనంద్, అగ్నిమాపక శాఖ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, డిసిపి చందన దీప్తి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చుట్టుపక్కల భవనాలు ఉండటంతో మంటలు వ్యాపిస్తాయన్న ఆందోళనతో ముందుగానే పోలీసులు వాటిని ఖాళీ చేయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios