మీ ప్రధాని బుర్రకు కూడా తట్టలేదు, ఎంఐఎంతోనే మా పోటీ: కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పోటీ ఎంఐఎంతోనేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పోటీ ఎంఐఎంతోనేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మంగళవారంనాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ విడుదల చేసిన ఛార్జీషీట్కు కౌంటరిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాము ప్రథమ స్థానంలో నిలిస్తే ఎంఐఎం రెండోస్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:అవకాశమిస్తే హైద్రాబాద్ను అమ్మేస్తారు: బీజేపీకి కేటీఆర్ కౌంటర్
ఈ దఫా కూడా తమ పార్టీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. రెండో స్థానంలో గతంలో మాదిరిగానే ఎంఐఎం నిలుస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మూడు, నాలుగు స్థానాల్లో పోటీ పడేందుకు ఇతర పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ఇది రాసిపెట్టుకోవాలని, డిసెంబర్ 4వ తేదీన ఆ విషయం తేలుతుందని ఆయన అన్నారు.
ఎంఐఎంతో తమ పార్టీకి ఎలాంటి పొత్తు లేదన్నారు. పాతబస్తీలో కూడా తమ పార్టీ ఈ దఫా గణనీయమైన స్థానాలను కైవసం చేసుకొంటుందనే ధీమాను వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీపైనా బీజేపీ నేతలపైనా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మీ ప్రధాని బుర్రకు కూడా తట్టని రైతుబంధు పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందని ఆయన బిజెపి నేతలను ఉద్దేశించి చెప్పారు. ఎంఐంతో అనవసరంగా తమకు పొత్తు అంటగడుతున్నారని ఆయన మండిపడ్డారు.