తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ లో ఓ అన్నదాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మెదక్: వరి సాగు వద్దన్నందుకు కొందరు, పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక మరికొందరు, అప్పుల బాధతో ఇంకొందరు... ఇలా తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు (telangana farmer suicides) నిత్యకృత్యంగా మారాయి. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం (trs government) రైతుబంధు (rythu bandhu) పేరిట అందిస్తున్న ఆర్థిక సాయం అందక మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా (medak district)లో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సిరగబోయిన ముత్యాలు(46) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకునేవాడు. తన కుటుంబానికున్న 1.5ఎకరాల అసైన్డ్ భూమిలోనే పంట పడించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.

అయితే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి ఎకరానికి ఏడాదికి పదివేల చొప్పున ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తోంది. ఇలా ముత్యాలుకు కూడా మొదట్లో పెట్టుబడి సాయం అందగా గత రెండుళ్లుగా నిలిచిపోయింది. తన చుట్టుపక్కల రైతులకు రైతు బంధు అందుతున్నా తనకు మాత్రం రాకపోవడంతో ముత్యాలు తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. 

read more Warangal Farmer Suicide:తెలంగాణలో ఆగని అన్నదాతల ఆత్మహత్యలు... తాజాగా యువరైతు బలి

ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత రైతు బంధు డబ్బులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. గత రెండుమూడు రోజులుగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. అయితే ఈసారి కూడా ముత్యాలుకు రైతు బంధు డబ్బులు రాలేవు. దీంతో తీవ్ర ఆవేదనకు గురయిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. 

బుధవారం తన పొలం వద్దకు చేరుకుని పంటకు కొట్టడానికి దాచిన పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల కాపాడటానికి కూడా ఎవరూ లేకపోవడంతో అతడు అక్కడే మరణించాడు. సాయంత్రమయినా ముత్యాలు ఇంటికిరాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లిచూడగా అప్పటికే అతడు మృతిచెందివున్నాడు. 

కుటుంబసభ్యుల పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని ముత్యాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబసభ్యుల నుండి వివరాలను సేకరించారు. రైతు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

read more పొలం తీసుకుని పరిహారం ఇవ్వలేదు.. రైతు ఆత్మహత్యాయత్నం

ఇదిలావుంటే ఇటీవల ఇదే మెదక్ జిల్లాలో కరణం రవికుమార్ (karanam ravikumar) అనే రైతు వరి వెయ్యవద్దని అన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు వైద్యం కోసం, కూతురి పెళ్లి కోసం రవికుమార్ భారీగా అప్పులు చేసాడు. ఇలా ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో వున్న అతడికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే వరి వేయవద్దనడం మరింత బాధించింది. తన పొలం వరిపంటకు మాత్రమే అనుకూలంగా వుండటంతో దిక్కుతోయని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

జిల్లా సిద్దిపేట(Siddipet) జిల్లాలో కూడా మరో రైతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. వర్గల్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన రైతు చింతల స్వామి (chintala swamy) వ్యవసాయ పొలం వివాదం కారణంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా వివిద కారణాలతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)