తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వరంగల్: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్య (telangana farmer suicide)లు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధాన్యం కొనుగోళ్ల పంచాయతీ రైతులను పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే వరిసాగు వద్దన్నందుకు కొందరు, సరయిన దిగుబడి రాక, మద్దతు ధర లభించిక మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ జిల్లా (warangal district)లో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు.
పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సురేష్ సన్నకారు రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో వరి సాగు చేస్తుండేవాడు. ఈసారి వరితో పాటు మిర్చి కూడా వేసాడు. అయితే ఈ రెండు పంటల్లోనూ అతడికి నష్టాలే ఎదురయ్యాయి.
ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా కనీసం కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో రైతు సురేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే డిప్రెషన్ లో తన పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
read more సీఎం సొంత జిల్లాలో మరో అన్నదాత ఆత్మహత్య... వైఎస్ షర్మిల ఆవేదన (Video)
అపస్మారక స్థితిలో పడివున్న సురేష్ ను గుర్తించిన తోటి రైతులకు పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో అనుమానం కలిగింది. వెంటనే వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే సురేష్ మృతిచెందాడు.
ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సురేష్ ఆత్మహత్య లక్ష్మీపురంలో విషాదాన్ని నింపింది. అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలావుంటే ఇటీవల కాలంలో తెలంగాణలో వరుసగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా (medak district)లో కరణం రవికుమార్ (karanam ravikumar) అనే రైతు వరి వెయ్యవద్దని అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొడుకు వైద్యం కోసం, కూతురి పెళ్లి కోసం రవికుమార్ భారీగా అప్పులు చేసాడు. ఇలా ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో వున్న అతడికి వరి వేయవద్దనడం మరింత బాధించింది. తన పొలం వరిపంటకు మాత్రమే అనుకూలంగా వుండటంతో దిక్కుతోయని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
read more హైదరాబాద్ : బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య.. సైలెంట్గా మృతదేహం ఆసుపత్రికి తరలింపు, ఉద్రిక్తత
ఇటీవల సీఎం కేసీఆర్ (KCR) సొంత జిల్లా సిద్దిపేట (Siddipet)లో మరో రైతన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వర్గల్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన రైతు చింతల స్వామి (chintala swamy) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దండుపల్లి గ్రామానికి చెందిన చింతల స్వామికి తండ్రి నుండి కొంత భూమి సంక్రమించింది. కుటుంబ అప్పులను తీర్చడానికి తండ్రి వ్యవసాయ భూమిని అమ్మగా 14గుంటల భూమి మాత్రమే మిగిలింది. ఈ భూమిని తన పేరిట చేయించుకోవాలని స్వామి గతకొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా ధరణి వెబ్ సైట్ లో నమోదు కావడంలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు దారుణానికి ఒడిగట్టాడు.
ఇలా కారణాలు ఏవయినా రైతుల ఆత్మహత్యలు మాత్రం తెలంగాణలో పెరిగిపోయాయి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆత్మహత్యలు జరక్కుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతిపక్షాలు, ప్రజలు కోరుతున్నారు.
(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)
