పోతిరెడ్డిపాడు వివాదం.. కేసీఆర్కు తెలియకుండా జగన్ నిర్ణయిస్తారా..?: డీకే అరుణ వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవో 203 తీసుకొచ్చారని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవో 203 తీసుకొచ్చారని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 203కు వ్యతిరేకంగా మాజీ మంత్రి డీకే అరుణ ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని బీజేపీ తప్పుపడుతోందన్నారు. తన స్వార్ధం కోసం కేసీఆర్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ఉత్తర తెలంగాణపై ఉన్న ప్రేమ సీఎంకుకు దక్షిణ తెలంగాణపై లేదని ఆమె ఎద్దేవా చేశారు.
కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, అందువల్ల జగన్ జీవో నెం.203 తీసుకొచ్చారని అరుణ ఆరోపించారు. పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అరుణ విమర్శించారు.
Also Read:బిజెపి అక్కడో మాట, ఇక్కడో మాట: జగన్ కు బాసట, కేసీఆర్ పై ఆందోళన
ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పాలమూరు ప్రజలకు చేసిందేమీలేదని, ప్రతిసారీ సెంటిమెంట్ వర్కౌట్ కాదని ఆమె హితవు పలికారు. పోతిరెడ్డిపాడుకి నీటిని తరలించడం వలన ఎక్కువ నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానేనని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణ తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది లేదన్నారు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 203పై తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ బోర్డ్, కోర్టుకు వెళ్లడం కంటే ముందు ఏపీ సీఎం జగన్ దగ్గరకు వెళ్లి మాట్లాడి, 203జీఓ రద్దు చేసే విధంగా సీఎం కేసీఆర్ చోరవ తీసుకోవాలన్నారు.
Also Read:కేసీఆర్, జగన్ మధ్య చిచ్చు: ఏమిటీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు?
పోతిరెడ్డిపాడు విషయంలో ఆనాడు రక్తం మరిగిపోతుందని మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓ పక్కా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు తరలించాల్సిన 2టీఎంసీలకు బదులు 1టీఎంసీకి కుదించారన్నారు.
అదే సందర్భంలో పోతిరెడ్డిపాడు కు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారంటే జగన్ కు , కేసీఆర్ కు మద్య ఉన్న రహస్య ఒప్పందం కుదిరిందని అర్థవుతోందని అరుణ ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు కు అదనంగా 3 టీఎంసీల నీటిని తరలించడం వలన మహబుబ్ నగర్ , నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మంలో కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు.