బీజేపీలోకి దామోదర రాజనర్సింహ సోదరుడు.. చేరికకు ఏర్పాట్లు, బాబూ మోహన్ అభ్యంతరంతో వాయిదా
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ సోదరుడు రామచంద్ర రాజ నర్సింహ బీజేపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి బాబు మోహన్ అభ్యంతరం తెలపడంతో చేరిక వాయిదా పడ్డట్టుగా బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ సోదరుడు రామచంద్ర రాజ నర్సింహ బీజేపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా జహీరాబాద్ నుండి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అయన సన్నిహితులు వచ్చారు. అలాగే పార్టీ కార్యాలయం బయట రామచంద్ర ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే అనూహ్య కారణాల కారణంగా చేరికల కార్యక్రమం వాయిడాపడ్డట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి బాబు మోహన్ అభ్యంతరం తెలపడంతో వాయిదా పడ్డట్టుగా బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం దామోదర్ రాజనర్సింహ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో గత 8 ఏళ్లుగా కొత్త రోగం మొదలైందని.. దాని పేరు కోవర్టిజం అని అన్నారు. అది చాలా ప్రమాదకరమైన రోగమని చెప్పారు. కోవర్టులు కాంగ్రెస్లో ఉంటూ, కాంగ్రెస్ పాట పాడుతూ.. ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మనోభావాలను, ధైర్యం దెబ్బతీస్తే పార్టీకే ప్రమాదమని అన్నారు.
ALso REad: కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు.. వారి వల్లే నష్టపోతున్నాం: దామోదర్ రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీల కూర్పుపై దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. బలహీనవర్గాలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు ఏమిటో తెలియనివారికి పదవులా? అని ప్రశ్నించారు. అసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. లోపం ఎక్కడ జరుగుతుందో పార్టీలో చర్చ జరగడం లేదన్నారు.
కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో దామోదర రాజనర్సింహ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో అంథోల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కొద్దిరోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక కొన్నిరోజులు యాక్టీవ్గా వున్నప్పటికీ, మళ్లీ సైలెంట్ అయ్యారు. దామోదర ఎప్పుడు ఏం చేస్తున్నారో పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదు.