Asianet News TeluguAsianet News Telugu

Etela Rajender: "కడుపునొస్తే గోలిమందు దొరకని గ్రామాల్లో సైతం మద్యం ఏరులైపారుతోంది "

Etela Rajender:  అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది. ఎన్నిక ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి.  తాజాగా సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. 

Etela Rajender Fires on CM KCR in Gajwel Constituency KRJ
Author
First Published Oct 27, 2023, 6:12 AM IST

Etela Rajender:  సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కేసీఆర్ పైసలతో కొట్లాడలేను. కానీ.. గజ్వేల్ ప్రజల అండతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గజ్వేల్ లో గురువారం బీజేపీ విజయ శంఖారావం సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రాంతానికి ఈటెల కొత్త కాదని, 1992 నుంచే ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటూ స్థిరపడినట్టు తెలిపారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అటు తెలంగాణ ఉద్యమంలో.. ఇటు అణగారిన వర్గాల గొంతుక పనిచేసినట్టు తెలిపారు. నీళ్లు, నిధులు, నియమకాలు అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల కోసం పోరాడిన ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులను సీఎం కేసీఆర్ ఘోరంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తన రాజ్యంలో సమ్మెకు తావులేదని 1700 మంది మున్సిపల్ కార్మికులను కలం పోటుతో తీసేసిన చరిత్ర సీఎం కేసీఆర్ ది అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి ముఖ్యమా? మా బతుకులు ముఖ్యమా అని కార్మికులు అడిగితే.. కార్మికుల పక్షాన పోరాడిన చరిత్ర ఈటెల రాజేందర్ ది పేర్కొన్నారు. అధికారం చేతులకు వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది .. వారి ఆస్తులు, వారి ఓట్ల కోసమే తప్ప ఉద్యోగుల పట్ల ప్రేమ లేదని అన్నారు. 

తనని సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా పార్టీ నుంచి వెళ్లగొడితే..  హుజరాబాద్ ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీదనో.. సీఎం కేసీఆర్ బొమ్మ పెట్టుకుని హుజురాబాద్లో గెలవలేదని, తాను హుజురాబాద్ ప్రజలు ఆదరిస్తే గెలుపొందానని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ గజ్వేల్ లో సభ పెడతానంటే.. మీటింగ్ కు రాకుండా  బీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో దావతులు, డబ్బులు పంపించారని, ప్రతి వ్యక్తికి గులాబీ పార్టీ వెలకట్టి కొనేందుకు ప్రయత్నిస్తారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఆరు నెలలు కొట్లాడిన చరిత్ర ఈటెల రాజేందర్ సొంతమని అన్నారు.  

ఉప ఎన్నికల  సమయంలో గొల్ల కురుమలకు యూనిట్ల పంపిణీ, దళితులకు దళిత బంధు పేరిట హుజరాబాద్ లో వందల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు మాదిరి గజ్వేల్ లో ఎందుకు ఇవ్వలేదని సీఎం కేసీఆర్ ని సూటిగా ప్రశ్నించారు. ఏం కేసీఆర్ ఎన్నికల సమయంలో గజకరణ గోకర్ణ టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తారని విమర్శలు గుప్పించారు.  

ధనిక రాష్ట్రాన్ని మద్యం అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 2500 కోట్లు ఖర్చు చేస్తున్నారనీ, కానీ  మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి ఏటా రూ .45000 కోట్లు వస్తున్నాయని అన్నారు. ప్రజల కడుపునొస్తే గోలిమందు దొరకని గ్రామాల్లో కూడా మద్యం ఏరులై పారుతోందని అన్నారు. మద్యం మత్తులో పడి యువత తమ జీవితాలను, పచ్చని సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారని అన్నారు. 

ఇన్ని జరుగుతున్న మల్లన్న సాగర్ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ ఎందుకు ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. ముప్పు బాధితుల ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటు చేయలేదని, వారు ఒక్కప్పడూ రైతులు జీవించిన వారు .. నేడు అడ్డా కూలీలుగా జీవనం సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి పేరిట ప్రతి నియోజకవర్గంలో 30 వేల కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మండిపడ్డారు. అలాగే.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని. అభివృద్ధి పేరిట వారి భూములను లాక్కున్న ఘనత కూడా సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఎన్నికల సమయంలో కుల సంఘాలకు భవనాలు, ప్రొసీడింగ్ కాపీలు, మద్యం అందజేస్తారని అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios