కాంగ్రెస్ నాయకులు అదొక్కటి చేస్తే...ఏ శిక్షకయినా సిద్దమే: ఎర్రబెల్లి సవాల్
మంత్రి ఎర్రబెల్లి ఇవాళ చీఫ్విప్, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితో కలిసి ఎంజీఎం హాస్పిటల్ లో అందుతున్న వైద్య సేవల గురించి సమీక్షించారు.
వరంగల్: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మకయి ప్రభుత్వంపై, ప్రభుత్వ హాస్పిటల్స్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా వారికి కరోనా రోగుల గురించి అంతగా ఆలోచిస్తుంటే ఎజీఎంలోని కరోనా వార్డుకు వెళ్లి బాధితుల నుండి వైద్యం, సౌకర్యాల గురించి తెలుసుకోవాలన్నారు. ఏ ఒక్కరయినా సరయిన వైద్యసేవలు అందడంలేదని చెబితే ఏ శిక్షకయినా తాను సిద్దమేనని మంత్రి సవాల్ విసిరారు.
మంత్రి ఎర్రబెల్లి ఇవాళ చీఫ్విప్, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితో కలిసి ఎంజీఎం హాస్పిటల్ లో అందుతున్న వైద్య సేవల గురించి సమీక్షించారు. సంబంధిత అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్న మంత్రి వారికి పలు సూచనలు చేశారు.
read more కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేయాలనుకుంటే..: మండలి ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇలా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయడం నచ్చని కాంగ్రెస్ నాయకులు అనవసర, అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం, డాక్టర్లు, మిగతా వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కామెంట్స్ చేయడం తగదని మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
కాంగ్రెస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని... అందుకు హుజూరాబాద్ దవాఖానలో విధుల్లో ఉన్న డాక్టర్స్పై దాడికి పాల్పడటమే నిదర్శనమన్నారు. అక్కడి కాంగ్రెస్ నాయకుడు తన స్థాయిని మరిచి డాక్టర్ పై దాడికి దిగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.