దేవికారాణితో కుమ్మక్కు.. బినామీ పేర్లతో ముకుంద రెడ్డి వ్యాపారాలు, వెలుగులోకి కొత్త విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో వెలుగులోకి సరికొత్త విషయాలు వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుంద్ రెడ్డి వ్యాపారాలు చేసినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్థారించింది
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో వెలుగులోకి సరికొత్త విషయాలు వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుంద్ రెడ్డి వ్యాపారాలు చేసినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్థారించింది. ప్రమోద్ రెడ్డి, వినయ్ రెడ్డి పేర్ల మీద ఆయన వ్యాపారాలు నిర్వహించారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలను కొనుగోలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
తక్కువ ధరకు దొరికే పరికరాలను కొనుగోలు చేసి... ప్రభుత్వం నుంచి అధిక ధరలు రాబట్టింది ఈ ముఠా. దేవికారాణి, ముకుందారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరిబాబులు కలిసి ఈ స్కామ్కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మళ్లీంచినట్లు ఈడీ గుర్తించింది. వీటిని పలు ఫార్మా కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లలోనూ పెట్టుబడులు పెట్టినట్లుగా నిర్థారించింది.
దేవికారాణి ఏకంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది. అలాగే పీఎంజే జ్యూయలరీలో పెద్ద మొత్తంలో నగలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఆస్తులతో పాటు నగల కొనుగోలు మొత్తం హవాలా ద్వారా చెల్లింపు జరిగినట్లు ఈడీ గుర్తించింది.
Also Read:ఈడీ సోదాలు:నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
కాగా, ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి కాంట్రాక్టర్ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లతో కలిపి సుమారు ఏడు చోట్ల శనివారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
శనివారం ఉదయం 6 గంటల నుంచే నిందితుల ఇళ్లలో ఏకకాలంలో మొదలైన తనిఖీలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిశాయి. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్ ముకుందరెడ్డి, అతని బావమరిది వినయ్రెడ్డి, ఏడు డొల్ల ఫార్మా కంపెనీల అధినేత బుర్రా ప్రమోద్రెడ్డి ఇళ్లల్లో భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.3 కోట్ల నగదు లభించిందని ఈడీ ప్రకటించింది.