ఆడబిడ్డనని చూడకుండా... బ్రోకర్ అంటూ ఈటల రాజేందర్ దుర్భాషలాడారు: మహిళ ఫిర్యాదు (వీడియో)
ఇప్పటికే దేవాలయాల భూములను కబ్జా చేసాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మరో అవినీతి ఆరోపణ వచ్చింది. ఆడబిడ్డనైన తనకు ఈటల అన్యాయం చేశాడని మహిళ ఆరోపించింది.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనకు అన్యాయం చేసాడంటూ ఓ మహిళ మీడియాముందుకు వచ్చింది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే అడవాళ్ళం అని చూడకుండా బ్రోకర్ అని తిడుతూ దుర్భాషలాడాడని సదరు మహిళ ఈటలపై సంచలన ఆరోపణలు చేసింది.
వివరాల్లోకి వెళితే... శివకుమారి అనే మహిళ ఇవాళ(మంగళవారం) సివిల్ సప్లై కార్యాలయంలో ఈటల రాజేందర్ పై ఫిర్యాదు చేసింది. తాను 2011 నుండి ఒక ఫుడ్ ఇండస్ట్రీ నడిపిస్తున్నానని... రేషన్ షాప్ లకు కంది పప్పు సరఫరా చేస్తుండేదానినని శివకుమారి తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రేషన్ షాపులకు కంది పప్పును తామే సప్లై చేసామన్నారు.
అయితే గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో హుదుద్ తుఫాన్ రావడంతో రేషన్ షాపులకు కంది పప్పు సరఫరా చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. దీంతో మంత్రిగా వున్న eatala rajender రాజేందర్ తమను పక్కనపెట్టి వేరేవారికి కందిపప్పు సరఫరా టెండర్ ను వేరేవారికి కేటాయించారు. దీనివలన తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని...బ్యాంక్ ల ద్వారా లోన్, అప్పులు పెరిగిపోయాయన్నారు.
వీడియో
''మంత్రి ఈటల తమ ఫుడ్ ఇండస్ట్రీని బ్లాక్ లిస్ట్ చేసి తీవ్ర అన్యాయం చేసాడు. కోటి 97 లక్షల 57 వేలు కట్టి రేషన్ షాపులకు కందిపప్పు సరఫరా చేయడానికి టెండర్ లో పాల్గొన్నాం. కానీ మాకు అన్యాయం చేసి మిగతావారికి టెండర్లు ఇచ్చారు. దీని గురించి అడిగితే అడవాళ్ళం అని చూడకుండా మమ్మల్ని బ్రోకర్ అని సంబోధించి నానా మాటలు అన్నారు'' అని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
read more Huzurabad Bypoll: కొంగు పట్టుకుని ఓట్లు అడుక్కుంటారు...ఈటల దంపతులతో జాగ్రత్త: బాల్క సుమన్ సంచలనం
''మాకు ఆర్ధికంగా చాలా నష్టం జరిగింది... ఈటల రాజేందర్ మాకు చాలా అన్యాయం చేశారు. మాకు జరిగిన అన్యాయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఫిర్యాదు చేసాం. అవినీతి పరుడైన ఈటలను శిక్షించాలని కోరాం'' అని తెలిపారు.
''మంత్రిగా వుండగా ఈటల సివిల్ సప్లై లో 2 వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారు. దానిపై విచారణ చేయాలి. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి. కేవలం మా ఒక్కరికే కాదు ఆయన అనేక అక్రమాలు చేశారు. వాటి అన్నింటి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం కేసీఆర్ ను కలుస్తాను. మాకు న్యాయం చేయాలని కోరతాం'' అని శివకుమారి వెల్లడించారు.
huzurabad bypoll నేపథ్యంలో ఈటలపై సదరు మహిళ చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రాదాన్యతను సంతరించుకున్నారు. మేం ఆరోపిస్తున్నట్లు ఈటల అవినీతిపరుడని బాధిత మహిళ ఆరోపణలతో మరోసారి రుజువయ్యింది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ బిజెపి మాత్రం ఇదంతా టీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకమని... హుజురాబాద్ లో ఈటలను ఓడించడానికే ఇదంతా చేస్తున్నారని అంటోంది.