Huzurabad Bypoll: కొంగు పట్టుకుని ఓట్లు అడుక్కుంటారు...ఈటల దంపతులతో జాగ్రత్త: బాల్క సుమన్ సంచలనం
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో సానుభూతి పేరు మీద ఓట్లు పొందాలని ఈటల దంపతులు చూస్తారని...కొంగు పట్టుకుని ఓట్లు అడుక్కుంటారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు.
కరీంనగర్: ఉత్తర భారతదేశ సంస్కృతిని తెలంగాణకి తీసుకురావాలని బిజేపి ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. అవసరమైతే ఈటల రాజేందర్ దంపతులు కొంగు పట్టుకొని ఓట్లు అడుక్కుంటారని... సానుభూతి పేరు మీద ఓట్లు పొందాలని చూస్తారని అన్నారు. కానీ ఈటల రాజేందర్, బిజేపి ఆటలు huzurabad bypoll లో సాగవు అన్నారు బాల్క సుమన్.
''హుజురాబాద్ పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బిజెపి నాయకులు తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయి. ఇందులో భాగంగానే తన కారుకింద పడి ఓ వ్యక్తి చనిపోయాడని ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇలా బిజేపి అంతా తప్పుడు ప్రచారం మీదే బ్రతుకుతుంది. నెత్తురు రుచిమరిగినది బిజేపికి అలవాటు'' అని సుమన్ మండిపడ్డారు.
''TRS ఎమ్మెల్యే బాల్క సుమన్ కారు కిందపడి అని కొందరు... నా అనుచరుల కారు కిందపడి చనిపోయాడని మరికొందరు బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడి కారుకింద పడి అతడు చనిపోయాడు. వ్యక్తిని ఢీకొట్టిన కారు విశ్వనాథ్ అనే వ్యక్తిది... అతడు బండి సంజయ్ కి సన్నిహితుడు'' అని సుమన్ వివరించారు.
''పోలింగ్ కు సమయం దగ్గరపడే కొద్ది బిజేపి నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తుంటారు. అందులో భాగంగానే నా కారు ఢీకొని వ్యక్తి చనిపోయాడని తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారు. కావాలనే మా టీఆర్ఎస్ నాయకుల కారు గుద్దడంవల్లే చనిపోయాడని అబద్దాలు ఆడుతున్నారు. ఈ అబద్దాల పునాదుల మీదే ఓట్లు అడుగుతున్నారు'' అని మండిపడ్డారు.
వీడియో
''శవాల మీద పేలాలు ఏరుకునే స్థాయికి బిజేపి దిగజారింది. ఈ కారు ప్రమాదం పై విచారణ చేపట్టాలి. బిజెపి నాయకులు తన కారు ఢీకొట్టడం వల్ల చనిపోయాడని ప్రచారం చేస్తున్న వ్యక్తి మృతిపై విచారణ చేబట్టాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, వరంగల్ సిపి తరుణ్ జోషిని కోరుతున్నా'' అన్నారు సుమన్.
''నా కారు ఢీకొనడంతో చనిపోయిన వ్యక్తికి ముఫ్ఫై లక్షలు ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసిందట. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా... ఆ కుటుంబానికి యాభై లక్షల పరిహారం ఇవ్వాలి. అతడి మృతిలో నా ప్రమేయమేమీ లేదు కాబట్టే ఈ డిమాండ్ చేస్తున్నా'' అన్నారు.
''ఇక హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.20వేలు పంచుతున్నామని అంటున్నారు... నిజానికి హుజురాబాద్ నియోజకవర్గంలో డబ్బులు పంచుతుందే ఈటల'' అని సుమన్ ఆరోపించారు.