తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారాన్ని దక్కించుకోవడం కోసం  కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే  సీఎం ఎవరనే చర్చ కూడ పార్టీలో లేకపోలేదు. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు సీఎం పదవిపై తమ మనసులో మాటలు బయట పెడుతున్నారు. జగ్గారెడ్డి నుండి జానారెడ్డి వరకు సీఎం పదవిపై నేతల కన్ను పడింది. తెలంగాణ ఎన్నికల్లో ఈ దఫా అధికారాన్ని దక్కించుకొంటామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. అయితే కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలు సీఎం పదవిపై కన్నేశారని వారి వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది. కొందరు నేతలైతే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా సీఎం అవుతానని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా సీఎంను అవుతానని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జానారెడ్డి వ్యాఖ్యానించారు. అత్యంత సీనియర్ నాయకుడు జానారెడ్డి. సీఎం పదవి మినహా అన్ని శాఖలను చేపట్టిన చరిత్ర జానారెడ్డికి ఉంది. 2018 ఎన్నికల్లో నోముల నరసింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడ నోముల నరసింహయ్య తనయుడి చేతిలో కూడ ఆయన ఓడిపోయాడు.

also read:ఏదో ఒక రోజు సీఎం అవుతా .. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దసరా రోజున సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనసులో మాట బయట పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు సీఎం అవుతానని తేల్చి చెప్పారు. అప్పటివరకు తనను జాగ్రత్తగా కాపాడుకోవాలని జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలను కోరారు. దసరా రోజున తన మనసులో మాటను బయటపెడుతున్నట్టుగా జగ్గారెడ్డి తెలిపారు.

కొడంగల్ బిడ్డకు రాష్ట్ర నాయకత్వం దక్కుతుందని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ వేయడానికి ముందు అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. దొంగలు సీఎం కాలేరని ఆమె వ్యాఖ్యానించారు. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నల్గొండలో ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో సీఎం పదవిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడే సీఎం పదవి అవసరం లేదన్నారు. కానీ ఏదో ఒక రోజూ రాష్ట్రానికి సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. 

also read:సూట్‌కేసులు పట్టుకొని వచ్చేవాళ్లకు బుద్ది చెప్పాలి: మందమర్రి సభలో వివేక్ వెంకటస్వామి పై కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని సీఎం చేస్తారనే చర్చ కూడ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు... కానీ సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో నేతలు పోటీ పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్ నేతలు పోటీపడుతున్నారని అధికార పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.