Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య: నిందితులు ముందే దొరికినా వదిలేశారు

డాాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రియాంకరెడ్డి హత్యకు ముందే నిందితులు దొరికారు. కానీ వారిని వదిలివేయడంతో చివరకు ప్రియాంకరెడ్డి హత్యకు దారి తీసిందనే అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

Doctor Priyanka Reddy murder case: Shocking facts about accused
Author
Hyderabad, First Published Dec 1, 2019, 8:21 AM IST


హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఒక్కో విషయం వెలుగు చూస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన నిందితులను వదిలేయడంతో చివరకు డాక్టర్ ప్రియాంకరెడ్డి బలైంది. డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య విషయం సంచలనం సృష్టించడంతో దర్యాప్తు చేస్తున్న అధికారులకు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

డాక్టర్ ప్రియాంకరెడ్డిపై అత్యాచారం చేయడానికి ముందు రోజే నిందితులు ఆర్టీఓ అధికారులకు చిక్కారు. సరైన పత్రాలు లేకపోవడం, ఓవర్ లోడ్ కాారణంగా లారీని సీజ్ చేయాలి. కానీ ఆ లారీని ఆర్టీఓ సీజ్ చేయలేదు. దీంతో మహబూబ్ నగర్ నుండి నేరుగా తొండుపల్లి చేరుకొన్న నిందితులు డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Also read:ప్రియాంక రెడ్డి కేసు: ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్, గోడ కూల్చివేత

డాక్టర్ ప్రియాంకరెడ్డిపై అత్యాచారం చేయడానికి 12 గంటల ముందు అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్‌ పోలీసులు.. లారీని అక్కడి నుంచి తీసేయాలని హెచ్చరించి వెళ్లిపోయారు.దీంతో నిందితులు తొండుపల్లి టోల్‌ప్లాజా గేట్‌ దగ్గరున్న సర్వీస్‌ రోడ్డులో లారీని నిలిపి అలాగే ఉంచారు. అక్కడే చాలాసేపు లారీ ఉంచారు.

Also Read: ఆ ఫోన్ కాల్ లేకపోయుంటే: ప్రియాంక నిందితుల గుట్టు విప్పింది అదే...

ఆపై అక్కడకు వచ్చిన ప్రియాంకను నిందితులు చూడటంతో వారి మదిలో దుర్బుద్ధి పుట్టి పథకం ప్రకారం ఘాతుకానికి తెగబడ్డారు. ఒకవేళ ఆర్టీఓ ఆ లారీని సీజ్‌ చేసినా సర్వీస్‌ రోడ్డులో కూడా అంతసేపు లారీని నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా ఈ దురాగతం జరిగి ఉండేది కాదని అర్ధమౌతోంది.

ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌ను పోలీసులు శనివారం షాద్‌నగర్‌ మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు సమర్పించారు. నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ నవంబర్‌ 21న బూర్గుల గ్రామం నుంచి ఇనుప కడ్డీలు తీసుకుని వెళ్లి కర్ణాటకలోని రాయచూర్‌లో ఆన్‌లోడ్‌ చేశారు.

Also Read: చర్లపల్లికి ప్రియాంక నిందితులు: హై సెక్యూరిటీ బ్లాక్‌లో సెల్, ఖైదీ నెంబర్లు ఇవే

 అనంతరం లారీ యజమాని సూచనలతో నవంబర్‌ 24న గంగావతికి వెళ్లి ఇటుకలు లోడ్‌ చేసుకొని హైదరాబాద్‌ బయలుదేరారు. వచ్చేదారిలో నవీన్, చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామంలో కలిశారు. 

అదే గ్రామంలో పొదల్లో ఉన్న ఐరన్‌ చానల్స్‌ను లోడ్‌ చేసుకుని తీసుకొస్తుండగా 26న మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ లారీని ఆపి తనిఖీలు చేశారు. ఆరిఫ్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని, పైగా లారీ ఓవర్‌ లోడ్‌తో ఉందని గుర్తించారు. 

ఈ నేపథ్యంలో ఆర్టీఓకు లారీ అప్పగించి రావొద్దంటూ యజమాని స్పష్టంచేయడంతో ఆరిఫ్‌ లారీ స్టార్ట్‌ కాకుండా చూసేందుకు సెల్ఫ్‌ స్టార్ట్‌ వైర్‌ పీకేశాడు. దీంతో ఆర్టీఓ లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో రాయ్‌కల్‌ టోల్‌ ప్లాజా వద్ద ఇనుప కడ్డీలను విక్రయించిన నిందితులు రూ.4 వేలు సంపాదించారు. 

అనంతరం తొండుపల్లి వచ్చి అక్కడే లారీ కేబిన్‌లో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వచ్చి అక్కడి నుంచి లారీని తీసేయాలని హెచ్చరించారు. సమీప దూరంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డులోకి లారీని తీసుకెళ్లి అక్కడ నిలిపి ఉంచారు. 

సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి, కేబిన్‌లోనే తాగుతూ కూర్చున్నారు. ఆ సమయంలో లారీ పక్కనే స్కూటీ పార్క్‌ చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ప్రియాంకారెడ్డిని చూశారు. ఆమె అందంగా ఉందని, స్కూటీ కోసం తిరిగి వచ్చినప్పుడు ఆమెపై అత్యాచారం చేయాలని నిందితులు కుట్ర పన్నారు. 

పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్‌ను నవీన్‌ పంక్చర్‌ చేశాడు. అప్పటికే ఫుల్‌ బాటిల్‌ మద్యం తాగిన నిందితులు మరో హాఫ్‌ బాటిల్‌ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రియాంక రావడాన్ని గమనించారు. ఆరిఫ్, చెన్నకేశవులు ఆమె వద్దకు వెళ్లారు.

మేడమ్, మీ స్కూటీ టైర్‌ పంక్చర్‌ అయిందని చెప్పి మాట కలిపారు. వారి వాలకం చూసిన ప్రియాంక స్పందించలేదు. కానీ నిందితులు ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించారు. స్కూటీ టైర్‌లో గాలి నింపుకొని తీసుకురావాలని ఆరిఫ్‌ శివను పంపించాడు. ఆరిఫ్‌ మాట్లాడుతుండగానే ప్రియాంక తన చెల్లెలికి ఫోన్‌ చేసి లారీలో ఉన్న వీళ్లను చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. కొద్దిసేపటికి షాప్‌ మూసి ఉందంటూ శివ తిరిగి వచ్చాడు. 

మరో షాప్‌లో గాలి నింపుకొని వస్తానంటూ శివ మళ్లీ బండి తీసుకుని వెళ్లాడు. అతడు గాలి నింపుకొని తిరిగి వచ్చిన వెంటనే నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. ఆరిఫ్‌ ప్రియాంక చేతులు పట్టుకోగా.. చెన్నకేశవులు ఆమె కాళ్లు, నవీన్‌ నడుము వద్ద పట్టుకుని ప్రహరీ గోడ లోపలున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు

 ఆ సమయంలో ఆమె హెల్ప్‌.. హెల్ప్‌ అంటూ ఆర్తనాదాలు చేసినా నిందితులు కనికరించలేదు. అరుపులు బయటకు వినిపించకుండా ఆరిఫ్‌ ఆమె నోటిని తన చేతితో మూసివేశాడు. వెంటనే నవీన్‌ ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేశాడు. శివ ఆమె దుస్తులను లాగేశాడు. దీంతో మళ్లీ హెల్ప్‌.. హెల్ప్‌ అని అరవడంతో నవీన్, చెన్నకేశవులు ప్రియాంక నోట్లో మద్యం పోశారు.

 అనంతరం ఒకరి తర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రియాంక స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి స్పృహ రావడంతో నిందితులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. 

ఆరిఫ్‌ ఆమె నోరు, ముక్కును చేతులతో గట్టిగా అదిమి పట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. నవీన్‌ కుమార్‌ ఆమె సెల్‌ఫోన్, పవర్‌ బ్యాంక్, వాచీలను కవర్‌లో పెట్టి లారీలో ఉంచాడు. అనంతరం ఓ బెడ్‌షీట్‌లో మృతదేహాన్ని చుట్టి లారీలో పడేశారు. అక్కడి నుంచి నవీన్, శివ స్కూటీపై, మహమ్మద్‌ ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో షాద్‌నగర్‌ వైపు రాత్రి 11 గంటలకు బయలుదేరారు. 

నవీన్, శివ బాటిల్‌ తీసుకుని పెట్రోల్‌ కోసం కొత్తూరు శివారులోని బంకుకు వెళ్లారు. అయితే, వారిపై అనుమానం వచ్చిన బంక్‌ ఉద్యోగి లింగరామ్‌ గౌడ్‌ బాటిల్లో పెట్రోల్‌ పోయడానికి నిరాకరించాడు. 

దీంతో దగ్గర్లో ఉన్న ఐవోసీ పెట్రోల్‌ బంక్‌లో నిందితులిద్దరూ పెట్రోల్‌ కొనుగోలు చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్‌ వద్దకు అందరూ చేరుకున్నారు. 

మృతదేహాన్ని లారీ నుంచి దింపి అండర్‌పాస్‌ కిందికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ప్రియాంక సిమ్‌కార్డులు, బ్యాగ్‌ను అదే మంటల్లో వేసి కాల్చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆరాంఘర్‌ వైపు వెళ్లిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios