డీఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు.. కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా.. (వీడియో)
సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుటుంబంలో చేరికల చిచ్చు రేపింది. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్లో చేరిన డీఎస్.. ఈ రోజు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుటుంబంలో చేరికల చిచ్చు రేగింది. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్లో చేరిన డీఎస్.. ఈ రోజు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు డీఎస్ రాజీనామా లేఖను పంపారు. డీఎస్ రాజీనామా లేఖను ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో డీఎస్ రాజీనామా లేఖపై సంతకం చేస్తున్నట్టుగా కూడా చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్లు, మీడియా వాళ్లు తమ ఇంటికి రావొద్దని విజయలక్ష్మి కోరారు. రాజీనామ లేఖను కూడా చూపించారు. డీఎస్కు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు.
మరోవైపు ధర్మపురి విజయలక్ష్మి పేరుతో విడుదలై లేఖలో.. ‘‘ఇగో డిఎస్ గారి రాజీనామా ! ఇది రాజకీయాలు చేసే సమయం కాదు ! ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి.. మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్న! ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి’’ అని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్లో చేరిన మరసుటి రోజే డీఎస్.. ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘర్షణే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. 8 ఏళ్ల కిందట కాంగ్రెస్ను వీడిన డీఎస్.. బీఆర్ఎస్లో చేరారు. కొంతకాలానికి ఆ పార్టీకి దూరమయ్యారు. మరోవైపు డీఎస్ ఇద్దరు కుమారులలో.. ఒకరైన ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే నిన్న మరో కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్లో చేరారు. సంజయ్తో పాటు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ వీల్ ఛైర్లో గాంధీ భవన్కు వచ్చిన డీఎస్.. అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అయితే ఈ పరిణామాలు ప్రస్తుతం బీజేపీలో ఉన్న అరవింద్కు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండటంతో.. కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘర్షణ నేపథ్యంలోనే తాజాగా డీఎస్ రాజీనామా ప్రకటన వెలువడినట్టుగా తెలుస్తోంది.
8 ఏళ్ల తర్వాత సొంతగూటికి డీఎస్..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వాలలో డీఎస్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత డీఎస్ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎస్ చిన్న కుమారుడు అరవింద్.. నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి బరిలో నిలిచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కేసీఆర్ కూతురు కవితను ఓడించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు.. డీఎస్కు వ్యతిరేకంగా పావులు కదిపాయి. ఆ తర్వాత నుంచి డీఎస్ యాక్టివ్ పాలిటిక్స్కు పూర్తిగా దూరమయ్యారు.
అయితే గత కొంతకాలంగా డీఎస్ తన సొంత గూటికి తిరిగివస్తారనే ప్రచారం విపరీతంగా సాగుతుంది. డీఎస్తో పాటు ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పలు సందర్భాల్లో ప్రచారం సాగింది. 2021 డిసెంబర్లొ డీఎస్ సోనియా గాంధీని కూడా కలిశారు. దీంతో ఆయన పార్టీలోకి తిరిగి రావడానికి సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే సోనియాను కలిసిన దాదాపు ఏడాదిన్నర తర్వాత డీఎస్ తన కుమారుడు సంజయ్తో కలిసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆదివారం గాంధీభవన్కు వీల్ఛైర్పై వచ్చిన డీఎస్.. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు జానా రెడ్డి, వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, రేణుకా చౌదరి, ఎండీ అలీ షబ్బీర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అయితే డీఎస్ కాంగ్రెస్లో చేరిక అంశంపై చివరి వరకు సస్పెన్స్ నెలకొంది. ఆదివారం ఉదయం వరకు కూడా సంజయ్ ఒక్కరే కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం సాగింది. అయితే గాంధీ భవన్కు వచ్చిన డీఎస్ కూడా కాంగ్రెస్ కండువా కుప్పకున్నారు.