హైదరాబాద్‌లో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వర్చువల్ ప్లాట్‌ఫామ్‌‌ ఆధారంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఎన్‌టీయూ వీసీ, ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులూ గణతంత్రం గురించి, స్వాతంత్ర్య సమరయోధుల గురించి తమ వీడియోలను ప్రదర్శించారు. 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ రోజు గణతంత్ర వేడుకలు(Republic Day) జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌(Delhi Public School)లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర్య(India Independence) ఉద్యమ స్ఫూర్తి, దేశభక్తిలతో కలగలసిన ఉత్సాహంతో ఈ స్కూల్‌లో వేడుకలు చేపట్టారు. వర్చువల్‌గా ఈ సంబురాలు జరిపారు. వందేమాతరం గీతంతో దీప ప్రజ్వలనం గావించారు. అనంతరం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జేఎన్‌టీయూ హైదరాబాద్ వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావులను ప్రిన్సిపల్ సునీతా ఎస్ రావు ఇంట్రడ్యూస్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అనంతరం స్కూల్ చైర్మన్, ప్రిన్సిపల్ మల్క కొంరయ్య సహా ముఖ్య అతిథులు అంతా కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ నినాదాలు ఇచ్చారు. ఎన్‌సీసీ క్యాడెట్లు స్కూల్ క్యాంపస్ గ్రౌండ్‌లో మార్చ్ చేపట్టారు. చైర్మన్ ఎం కొంరయ్య, ముఖ్య అతిథులు, ఇతర అతిథులు తమ తమ ప్రసంగాలతో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించారు. అదే సందర్భంలో విద్యార్థులు రూపొందించిన కొన్ని వీడియోలను ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతపై విద్యార్థులు తమ వీడియోలు రూపొందించారు.

భారత స్వాతంత్ర్య సమరయోధుల గురించి, స్వాతంత్ర్య సమరం గురించి, గణతంత్ర దినోత్సవాల గురించి విద్యార్థులు ప్రసంగాలు ఇచ్చారు. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు, హిందీ భాషల్లో వారు ఉపన్యాసాలు ఇచ్చారు. చివరకు జాతీయ గీతాలపన చేశారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవం సానుకూలంగా జరిగింది. విద్యార్థుల్లో మాతృభూమి పట్ల గర్వం, గౌరవం నింపేలా కార్యక్రమం జరిగిందని పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉండగా, 

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

అంతకు ముందు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్.. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ త్రివిధ దళాల అధికారులు.. స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచిన కేసీఆర్.. యుద్దవీరులకు వందనం చేశారు. 

ఇక, తెలంగాణ వ్యాప్తంగా 73వ గణంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక, తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, బీఆర్‌కే భవన్‌లో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.

శాసన మండలి ఆవరణలో ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఇక, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాను ఎగరవేశారు.