కుటుంబసభ్యులతో ఆనందంగా ఉగాది పండగను జరుపుకోడానికి ఇంటికి వెళ్లిన యువతి హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. 

వరంగల్ :కేవలం వేలి ఉంగరం పోయిందని యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. అమ్మానాన్నా... నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఇంట్లోనే ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... వరంగల్ సమీపంలోని గున్నెపల్లి గ్రామానికి చెందిన మద్దులు జానకీరాములు కూతురు హేమలతారెడ్డి(19) హన్మకొండలో చదువుకునేది. ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె అక్కడే వుండేది. ఇటీవల ఉగాది పండగకు ఇంటికి వచ్చిన హేమలత కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాల్సింది పోయి క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. 

Read More గురుగ్రామ్ లో దారుణం.. ప్రియుడి ఆత్మహత్యతో కలత చెందిన ప్రియురాలు.. చివరికి ఆమె కూడా..

చేతి వేలికి పెట్టుకున్న బంగారు ఉంగరం కనిపించకుండా పోవడంతో హేమలత తీవ్ర భయాందోళనకు గురయ్యింది. ఇంట్లోవాళ్లు ఏమాంటారోనని భయపడిపోయిన ఆమె ఆత్మహత్యకు సిద్దపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు గల కారణాలతో సూసైడ్ లెటర్ రాసిపెట్టి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకున్న చాలాసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో హేమలత ప్రాణాలు కోల్పోయింది. 

ఉరితాడుకు వేలాడుతున్న కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. యువతి మృతదేహాన్ని కిందకుదించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతురాలి తండ్రి జానకీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

(ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు)