Huzurabad Bypoll:డబ్బులు పంచేది టీఆర్ఎస్...గెలిచేది మాత్రం బిజెపి: వివేక్ జోస్యం
హుజురాబాద్ ఉపఎన్నికలో డబ్బులు పంచేది టీఆర్ఎస్ అయితే గెలిచేది బిజెపి అని మాజీ ఎంపీ వివేక్ జోస్యం చెప్పారు.పాదయాత్ర సమయంలోనే ప్రజలు ఈటెలను గెలిపిస్తామనే కంకణం కట్టుకున్నారన్నారు.
హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం కేసీఆర్ కి తెలిసిపోయిందని... అందువల్లే మంత్రులంతా వచ్చి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచినా ఓటు మాత్రం బీజేపీకి వేస్తారని అన్నారు. పాదయాత్రలో ప్రజలు ఈటెలను గెలిపిస్తామనే కంకణం కట్టుకున్నారన్నారు. ఈటెల గెలిస్తేనే తాము గెలిచినట్లని ప్రజలు అనుుకుంటున్నారని వివేక్ అన్నారు.
''ఈటెల రాజీనామా వల్లే హుజురాబాద్ లో భారీఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. హుజురాబాద్ మాదిరిగానే ఇతర నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగాలి'' అని మాజీ ఎంపీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు.
''సింగరేణిలో 18 వేల మంది ఉద్యోగులను ఇదే కేసీఆర్ భర్తరఫ్ చేశారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఉద్యోగాలు గుర్తుకొస్తున్నాయి. వాగ్ధానాలు చేయడమే ముఖ్యమంత్రి తెలుసు... వాటిని నెరవేర్చకుండానే ఆయన మరిచిపోతారు'' అని అన్నారు.
read more Huzurabad Bypoll:ఎవరిది తప్పయితే వారు ముక్కు నేలకు రాద్దాం... సిద్దమేనా హరీష్: ఈటల సవాల్
''ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఐదు వేల ఉద్యోగాలు కల్పించారు. నిజంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితుల మీద ప్రేమే ఉంటే... తన తర్వాత కేటీఆర్ ను కాకుండా ఓ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలి'' అని వివేక్ డిమాండ్ చేశారు.
''హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల పోటీ గెల్లు శ్రీనివాస్ తో కాదు కేసీఆర్ తోనే. ముఖ్యమంత్రికి ఉద్యమ కారులపై కక్ష్య ఉంది. అందువల్లే ఓడిపోయే స్థానంలో శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించాడు. ప్రజలంతా ఈటెల గెలుపు కోసమే ఎదురుచూస్తున్నారు'' అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు.